హైదరాబాద్‌కు నాలుగో విజయం

23 Oct, 2023 04:03 IST|Sakshi

 రాణించిన తిలక్, రోహిత్, రవితేజ

జైపూర్‌: సయ్యద్‌ ముస్తాక్‌ అలీ ట్రోఫీ దేశవాళీ టి20 క్రికెట్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌ జట్టు విజయపరంపర కొనసాగుతోంది. గ్రూప్‌ ‘ఎ’లో భాగంగా మిజోరం జట్టుతో జరిగిన మ్యాచ్‌లో తిలక్‌ వర్మ సారథ్యంలోని హైదరాబాద్‌ జట్టు ఆరు వికెట్ల తేడాతో గెలిచి ఈ టోరీ్నలో వరుసగా నాలుగో విజయం నమోదు చేసింది. ముందుగా బ్యాటింగ్‌ చేసిన మిజోరం సరిగ్గా 20 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌటైంది.

అగ్ని చోప్రా (16 బంతుల్లో 28; 2 ఫోర్లు, 2 సిక్స్‌లు), జోసెఫ్‌ లాథన్‌కుమా (20 బంతుల్లో 24; 2 ఫోర్లు, 1 సిక్స్‌) రాణించారు. హైదరాబాద్‌ బౌలర్లు రవితేజ (3/30), సీవీ మిలింద్‌ (2/18), చింతల రక్షణ్‌ రెడ్డి (2/20) మిజోరం జట్టును కట్టడి చేశారు. 115 పరుగుల లక్ష్యాన్ని హైదరాబాద్‌ 15.1 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించింది.

రోహిత్‌ రాయుడు (31 బంతుల్లో 41; 5 ఫోర్లు, 1 సిక్స్‌), కెపె్టన్‌ తిలక్‌ వర్మ (24 బంతుల్లో 40 నాటౌట్‌; 2 ఫోర్లు, 3 సిక్స్‌లు) ధాటిగా ఆడి హైదరాబాద్‌ విజయంలో కీలకపాత్ర పోషించారు. ఎనిమిది జట్లున్న గ్రూప్‌ ‘ఎ’లో హైదరాబాద్‌ ప్రస్తుతం 16 పాయింట్లతో ముంబై జట్టుతో కలిసి సంయుక్తంగా అగ్రస్థానంలో ఉంది. నేడు జరిగే తదుపరి మ్యాచ్‌లో బరోడా జట్టుతో హైదరాబాద్‌ తలపడుతుంది.   

మరిన్ని వార్తలు