IND vs NZ: భారత అభిమానులకు బ్యాడ్‌ న్యూస్‌.. న్యూజిలాండ్‌తో తొలి టీ20 కష్టమే!

17 Nov, 2022 15:21 IST|Sakshi

టీ20 ప్రపంచకప్‌లో ఘోర పరాభవం అనంతరం టీమిండియా తొలి టీ20 సిరీస్‌కు సిద్దమైంది. న్యూజిలాండ్‌ పర్యటనకు వెళ్లిన భారత జట్టు తొలుత టీ20 సిరీస్‌ ఆడనుంది. ఈ టీ20 సిరీస్‌కు టీమిండియా రెగ్యూలర్‌ కెప్టెన్‌  రోహిత్ శర్మ గైర్హాజరీ కావడంతో ఆల్‌రౌండర్‌ హార్దిక్‌ పాం‍డ్యా సారథ్యం వహించనున్నాడు.

ఇక సిరీస్‌లో భాగంగా తొలి టీ20 శుక్రవారం (నవంబర్‌ 18) వెల్లింగ్టన్‌ వేదికగా జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. శుక్రవారం వెల్లింగ్టన్‌లో భారీ వర్షం కురిసే ఛాన్స్‌ ఉన్నట్లు అక్కడి వాతావారణ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. మ్యాచ్ జరిగే సమయంలో వర్షం రావడానికి 50 శాతం కంటే ఎక్కువ ఆస్కారం ఉన్నట్లు పేర్కొంది. ఈ మ్యాచ్‌ స్థానిక కాలమానం ప్రకారం రాత్రి 7:30 గంటలకు ప్రారంభం కానుంది.

కాగా గత రెండు రోజులుగా వెల్లింగ్టన్‌లో భారీ వర్షాలు కురిస్తున్నాయి. ఇప్పటికే పిచ్‌ను కవర్స్‌తో కప్పి ఉంచారు. ఒక వేళ శుక్రవారం రోజు మొత్తం భారీ వర్షం కురిసి నట్లయితే మ్యాచ్‌ను రద్దు చేసే అవకాశం ఉంది.

టీ20 సిరీస్‌కు భారత జట్టు..
హార్ధిక్‌ పాండ్యా (కెప్టెన్‌), రిషబ్‌ పంత్‌ (వైస్‌ కెప్టెన్‌), ఇషాన్‌ కిషన్‌, శుబ్‌మన్‌ గిల్‌, దీపక్‌ హుడా, సూర్యకుమార్‌ యాదవ్‌, శ్రేయస్‌ అయ్యర్‌, సంజూ శాంసన్‌, వాషింగ్టన్‌ సుందర్‌, యుజ్వేంద్ర చహల్‌, కుల్దీప్‌ యాదవ్‌, హర్షల్‌ పటేల్‌, మహ్మద్‌ సిరాజ్‌, భువనేశ్వర్‌ కుమార్‌, అర్షదీప్‌ సింగ్‌, ఉమ్రాన్‌ మాలిక్‌.


చదవండి: AUS Vs ENG: కళ్లు చెదిరే విన్యాసం.. క్యాచ్‌ పట్టకపోయినా సంచలనమే

మరిన్ని వార్తలు