Ravichandran Ashwin: అదే జరిగితే వన్డేల అస్తిత్వం ప్రమాదంలో పడ్డట్లే!

14 Jul, 2022 09:44 IST|Sakshi

‘వన్డేలు రూపుమార్చుకోకుంటే కష్టం’ 

Ravichandran Ashwin: వన్డే క్రికెట్‌ ఇటీవలి కాలంలో ఎలాంటి కొత్త తరహా మార్పులు చూపించకుండా టి20లకు కొనసాగింపుగానే కనిపిస్తోందని టీమిండియా స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ అన్నాడు. ఒకవేళ ఇదే కొనసాగితే వన్డేల అస్తిత్వం ప్రమాదంలో పడుతుందని వ్యాఖ్యానించాడు. 

రెండు ఎండ్‌లనుంచి రెండు కొత్త బంతులను కాకుండా ఒకే బంతిని వాడితే రివర్స్‌ స్వింగ్‌ సాధ్యమవుతుందన్న అశ్విన్‌.. స్పిన్నర్లు కూడా ప్రభావం చూపిస్తే వన్డేల్లో బ్యాటర్లు, బౌలర్ల మధ్య సమతూకం ఉండి ఆసక్తికరంగా మారతాయని సూచించాడు. ఇక టీ20 మ్యాచ్‌కు కొనసాగింపుగా అన్నట్లు వన్డే మ్యాచ్‌ సాగితే.. అందులో ఉన్న మజా పోతుందని పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌ మాజీ కెప్టెన్‌ మైకేల్‌ వాన్‌ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో అశ్విన్‌ ఈ మేరకు తన అభిప్రాయాలు పంచుకున్నాడు.

కాగా ఇంగ్లండ్‌తో రీషెడ్యూల్డ్‌ టెస్టు నేపథ్యంలో జట్టు వెంటే ఉన్న అశ్విన్‌కు తుది జట్టులో చోటు దక్కలేదన్న విషయం తెలిసిందే. అతడి స్థానంలో టీమ్‌లోకి వచ్చిన రవీంద్ర జడేజా మెరుగైన ఇన్నింగ్స్‌ ఆడి సత్తా చాటాడు. ఇక ఈ మ్యాచ్‌లో ఓటమిపాలైన టీమిండియా.. ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ను 2-2తో సమం చేసుకుంది.  ఇక వన్డే ఫార్మాట్‌లో 151 వికెట్లు పడగొట్టిన అశూ.. టెస్టుల్లో 442 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.

చదవండి: ICC World Cup Super League: వన్డే సిరీస్‌ రద్దు.. దక్షిణాఫ్రికాకు భారీ షాక్‌! ప్రపంచకప్‌ రేసు నుంచి తప్పుకొన్నట్లేనా?

మరిన్ని వార్తలు