'అతని బంతులు ఎదుర్కోవడం ఆసీస్‌కు కష్టమే'

17 Dec, 2020 12:55 IST|Sakshi

అడిలైడ్‌ : ఆస్ట్రేలియాతో జరుగుతున్న టెస్ట్‌ సిరీస్‌లో టీమిండియా ఫాస్ట్‌ బౌలర్‌ జస్‌ప్రీత్‌ బుమ్రా ఎప్పటికైనా ప్రమాదకారేనని న్యూజిలాండ్‌ మాజీ బౌలర్‌ షేన్‌ బాండ్‌ అభిప్రాయపడ్డాడు. అడిలైడ్‌ వేదికగా నేడు తొలి టెస్టు ప్రారంభమైన సందర్భంగా బాండ్‌ బుమ్రా గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

'బూమ్‌ బూమ్‌.. బుమ్రా ఫామ్‌లో ఉంటే చాలా ప్రమాదకారి. గంటకు 145 కిమీ వేగంతో వేసే బంతులు ఆసీస్‌ను సర్వనాశనం చేయనున్నాయి. ఇప్పటికే బుమ్రా ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్లను ముప్పతిప్పలు పెట్టడానికి తన అస్త్రాలన్ని సిద్ధం చేసుకుంటున్నాడు. ఒకవేళ సరైన పిచ్‌ తగిలితే మాత్రం అతన్ని ఆపడం ఎవరితరం కాదు. పేసర్లకు స్వర్గధామంగా నిలిచే పెర్త్‌( వాకా మైదానం)లో బుమ్రా చెలరేగే అవకాశం ఉంది.2018-19 ఆసీస్‌ పర్యటనను అతను మరోసారి రిపీట్‌ చేస్తే మాత్రం ఆసీస్‌కు కష్టాలు తప్పకపోవచ్చంటూ' తెలిపాడు. (చదవండి : పృథ్వీ షా డకౌట్‌.. వైరలవుతున్న ట్వీట్స్‌)

వాస్తవానికి బుమ్రాకు ఆసీస్‌ టూర్‌ ప్రారంభంలో అంతగా అచ్చి రాలేదు. వన్డే సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు కలిపి నాలుగు వికెట్లు మాత్రమే తీయగలిగాడు. వన్డే మ్యాచ్‌లు జరిగిన వేదికలన్ని ఫ్లాట్‌ పిచ్‌లు సిద్దం చేయడంతో ఎక్కువగా వికెట్లు తీయలేకపోయాడు. ఆ తర్వాత జరిగిన టీ20 సిరీస్‌లో బుమ్రాను ఆడించలేదు. అయితే టెస్టు సిరీస్‌లో మాత్రం పరిస్థితి అలా ఉండకపోవచ్చు.  టెస్టు ఫార్మాట్‌లో సుధీర్ఘంగా బౌలింగ్‌ చేసే అవకాశం ఉండడం.. మ్యాచ్‌లన్నీ పేసర్లకు అనుకూలించే విధంగా వికెట్లు రూపొందించడం బుమ్రాకు సానుకూలాంశంగా మారనుంది. ఇక 2018-19 ఆసీస్‌ పర్యటనలో బుమ్రా టెస్టు సిరీస్‌లో దుమ్మురేపే ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. నాలుగు టెస్టుల సిరీస్‌లో 21 వికెట్లు తీసి టీమిండియా 2-1 తేడాతో సిరీస్‌ గెలవడంలో​ కీలకపాత్ర పోషించాడు.(చదవండి : దుమ్మురేపిన కోహ్లి.. జడేజా)

మరిన్ని వార్తలు