Sultan of Johor Cup: ఫైనల్లో భారత్‌

29 Oct, 2022 04:39 IST|Sakshi

సుల్తాన్‌ ఆఫ్‌ జొహొర్‌ కప్‌ హాకీ

జొహొర్‌ (మలేసియా): సుల్తాన్‌ ఆఫ్‌ జొహొర్‌ కప్‌ జూనియర్‌ హాకీ టోర్నమెంట్‌లో భారత జట్టు ఫైనల్లోకి అడుగు పెట్టింది. శుక్రవారం బ్రిటన్‌తో జరిగిన చివరి లీగ్‌ మ్యాచ్‌ను భారత్‌ 5–5తో ‘డ్రా’గా ముగించినా తుది పోరుకు అర్హత సాధించడంలో సఫలమైంది. భారత్‌ తరఫున పూవన్న (7వ నిమిషం), అమన్‌దీప్‌ (50), అరైజీత్‌ సింగ్‌ (53), శార్దా నంద్‌ (56, 58) గోల్స్‌ సాధించారు.

బ్రిటన్‌ ఆటగాళ్లలో మ్యాక్స్‌ అండర్నస్‌ (1వ నిమిషం, 40వ), జామీ గోల్డెన్‌ (54, 56) రెండేసి గోల్స్‌ కొట్టగా, హారిసన్‌ స్టోన్‌ (42) మరో గోల్‌ నమోదు చేశాడు. ఐదు మ్యాచ్‌ల తర్వాత 7 పాయింట్లు సాధించిన భారత్‌ ప్రస్తుతం రెండో స్థానంలో ఉంది. 4 మ్యాచ్‌ల ద్వారానే 10 పాయింట్లు సాధించిన ఆస్ట్రేలియా ముందే ఫైనల్‌కు అర్హత సాధించగా, ఫైనల్‌ స్థానం కోసం దక్షిణాఫ్రికాతో భారత్‌ పోటీలో నిలిచింది. అయితే తర్వాత జరిగిన చివరి మ్యాచ్‌లో ఆస్ట్రేలియా 6–1 తేడాతో దక్షిణాఫ్రికాను చిత్తు చేయడంతో భారత్‌ ముందంజ వేసింది. భారత్, ఆస్ట్రేలియా మధ్య ఆదివారం ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతుంది.

మరిన్ని వార్తలు