వికెట్‌ తీశాడు.. చిత్రమైన సెలబ్రేషన్‌తో మెరిశాడు

24 Apr, 2021 16:57 IST|Sakshi

హరారే: క్రికెట్‌లో బౌలర్‌ వికెట్‌ తీసినప్పుడు.. బ్యాట్స్‌మన్‌ సెంచరీ చేసినప్పుడు.. ఒక జట్టు మ్యాచ్‌ గెలిచినప్పుడు రకరకాలుగా తమ ఆనందాన్ని సెలబ్రేట్‌ చేసుకుంటారు. అందునా కొందరు క్రికెటర్లు మాత్రం తమ సెలబ్రేషన్స్‌తో ఎప్పటికీ మదిలో నిలిచిపోతుంటారు. ఇలాంటి సెలబ్రేషన్స్‌ ఎక్కువగా మనం విండీస్‌ క్రికెటర్లలో చూస్తుంటాం. వీరంతా డ్యాన్స్‌.. సెల్యూట్‌ ఇలా రకరకాల వేరియేషన్స్‌తో సెలబ్రేట్‌ చేసుకుంటే.. దక్షిణాఫ్రికా క్రికెటర్‌ తబ్రేజ్ షంసీ వికెట్‌ తీసినప్పుడల్లా తన కాలికున్న షూను తీసి చెవి దగ్గరు పెట్టుకొని ఫోన్‌లో మాట్లాడుతున్నట్లుగా చేస్తూ వినూత్న రీతిలో సెలబ్రేట్‌ చేసుకుంటాడు.

అచ్చం అతని తరహాలోనే జింబాబ్వే క్రికెటర్‌ చేసిన పని ఇప్పుడు సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌గా మారింది. పాకిస్తాన్‌, జింబాబ్వే మధ్య జరుగుతున్న టీ20 సిరీస్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పాకిస్తాన్‌ బ్యాటింగ్‌ సమయంలో జింబాబ్వే బౌలర్‌  ల్యూక్ జోంగ్వే  ఇన్‌ఫాం బ్యాట్స్‌మన్‌ బాబర్‌ అజమ్‌ను తెలివైన బంతితో బోల్తా కొట్టించాడు. దీంతో పెద్ద వికెట్‌ తీశానన్న ఆనందంలో జోంగ్వే తన కాలికున్న షూ తీసి చెవి దగ్గరు పెట్టుకొని సెలబ్రేట్‌ చేసుకున్నాడు.

దీనిపై దక్షిణాఫ్రికా బౌలర్‌ షంసీ స్పందించాడు..'' కూల్‌ బ్రదర్‌..  ఇంత మంచి గేమ్‌లో నీ సెలబ్రేషన్‌ సూపర్‌.. నన్ను మరిపించేలా నువ్వు సెలబ్రేట్‌ చేసుకున్నావ్‌..'' అంటూ కామెంట్‌ చేశాడు. షంసీ కామెంట్స్‌పై ల్యూకో జోంగ్వే తనదైన రీతిలో స్పందించారు. ''దీనికి ఆద్యుడు నువ్వే.. ఒక బ్రదర్‌గా నేను బోర్డర్‌ నుంచి నిన్ను ఇమిటేట్‌ చేశా'' అంటూ ఫన్నీ కామెంట్‌ చేశాడు. కాగా ఈ మ్యాచ్‌లో జింబాబ్వే పాకిస్తాన్‌పై సంచలన విజయాన్ని నమోదు చేసింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన జింబాబ్వే 20 ఓవర్లలో​ 9 వికెట్ల నష్టానికి 118 పరుగులు చేసింది. అనంతరం స్వల్ప లక్ష్యంతో బరిలోకి దిగిన పాకిస్తాన్‌ 99 పరుగులకే కుప్పకూలింది. ల్యూకో జోంగ్వే  4 వికెట్లతో పాక్‌ పతనాన్ని శాసించాడు. ఈ విజయంతో మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ 1-1తో సమం అయింది. ఇరు జట్లకు కీలకమైన మూడో టీ20 రేపు (ఏప్రిల్‌ 25న) జరగనుంది.
చదవండి: ఆ బౌన్సర్‌కు హెల్మెట్‌ సెపరేట్‌ అయ్యింది..!

మరిన్ని వార్తలు