భర్త వీడియో కాల్‌ చేయలేదని.. మొదటి భార్య ఆత్మహత్య

9 May, 2023 10:34 IST|Sakshi

అన్నానగర్‌: తన భర్త మొదటి భార్యతో కలిసి వేరే రాష్ట్రానికి వెళ్లడంతో రెండున్నర ఏళ్ల బిడ్డను విడిచిపెట్టి మహిళ ఆత్మహత్య చేసుకుంది. కోయంబత్తూరు సమీపంలోని గణపతి వీధికి చెందిన రఘుపతి (38) వ్యాపారి. ఇతనికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కోయంబత్తూరుకు చెందిన దివ్యభారతి(31)ని రఘుపతి 2వ వివాహం చేసుకున్నాడు. వీరికి రెండున్నర ఏళ్ల కుమార్తె ఉంది. ఆ ప్రాంతంలోని లక్ష్మీపురంలో దివ్యభారతి తన బిడ్డతో కలిసి నివసిస్తోంది. రఘుపతి కొద్ది రోజులు భార్య ఇంట్లోనూ, కొన్ని రోజులు దివ్యభారతి ఇంట్లోనూ ఉండేవాడు.

రఘుపతికి అప్పటికే పెళ్లయిందని, భార్య, పిల్లలు ఉన్నారని దివ్యభారతికి తెలిసినా.. మొదటి భార్య ఇంటికి వెళ్లవద్దని చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో వీరి మధ్య తరచూ కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో రఘుపతి తన మొదటి భార్య, పిల్లలతో కలిసి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలుసుకున్న దివ్యభారతి తన మొదటి భార్య పిల్లలతో కలిసి ఆంధ్రాకు వెళ్లొద్దని చెప్పి గొడవకు దిగినట్లు సమాచారం. అయితే అతను తన మొదటి భార్య, పిల్లలతో కలిసి ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లాడు. ఈ విషయం తెలుసుకున్న దివ్యభారతి భర్తను ఎక్కడున్నావని ప్రశ్నించింది.

తనతో వీడియో కాల్‌ మాట్లాడాలని.. లేకుంటే ఆత్మహత్య చేసుకుంటానని చెప్పింది. అయితే రఘుపతి వీడియో కాల్‌ చేయలేదని తెలుస్తోంది. దీంతో మనస్తాపం చెందిన దివ్యభారతి సోమవారం ఉదయం ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.

మరిన్ని వార్తలు