యాంకర్‌గా అవకాశం ఇప్పిస్తానని నమ్మించి...

1 Mar, 2021 08:07 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నల్లగొండ : ఉద్యోగాలు ఇప్పిస్తామని, జ్యోతిష్యం పేరిట ప్రజలను నిండా ముంచిన విజయవాడలోని భవానీపురంకు చెందిన కోనాల అచ్చిరెడ్డిని ఆదివారం టూటౌన్‌ పోలీసులు అరెస్టు చేశారు. ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు తీసుకొని మోసం చేశాడని నల్లగొండ పట్టణంలోని హనుమాన్‌నగర్‌కు చెందిన సమ్మినేని సాయి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అచ్చిరెడ్డిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులకు మరిన్ని విషయాలు తెలిశాయి. ఖమ్మంకు చెందిన ఓ మహిళకు సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో వాటా ఇస్తానని రూ.50లక్షల తీసుకుని మోసం చేసిన కేసులో ఖమ్మం వన్‌టౌన్‌ పోలీస్‌ స్టేషన్‌లో గత ఏడాది కేసు నమోదు చేశారు.

ఖమ్మం పట్టణానికి చెందిన మరో మహిళకు రైల్వేలో అసిస్టెంట్‌ ఇంజనీరింగ్‌ ఉద్యోగం ఇప్పిస్తామని రూ.20లక్షలు మోసం చేసిన విషయంలో విజయవాడలోని భవానీపురం పోలీస్‌ స్టేషన్‌లో కేసు నమోదైంది. విజయవాడకు చెందిన ఒక మహిళను టీవీలో యాంకర్‌గా అవకాశం ఇప్పిస్తానని నమ్మించి రూ.25లక్షలు మోసం చేసిన కేసులో భవానీపురం స్టేషన్‌లోనే మరో కేసు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. నల్లగొండలో జ్యోతిష్యం పేరిట మరో వ్యక్తి దగ్గర రూ.4లక్షలు తీసుకొని మోసం చేసినట్లు తెలిసింది. ఉద్యోగాలు ఇప్పిస్తామని, జ్యోతిష్యం పేరిట మోసపోయిన వారు ఉంటే ఫిర్యాదు చేయాలని పోలీసులు కోరారు. 

మరిన్ని వార్తలు