భారీ వర్షాలు: నేడు తెలంగాణలో సెలవు 

28 Sep, 2021 02:13 IST|Sakshi

అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు వర్తింపు

అత్యవసర సర్వీసులకు మాత్రం మినహాయింపు

సాక్షి, హైదరాబాద్‌:  రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడుతుండటం, మరో రెండు రోజు లూ కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించడంతో.. ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని విద్యా సంస్థలు, ప్రభుత్వ, ప్రైవేటు కార్యాలయాలకు మంగళవారం సెలవు ప్రకటించింది. భారీ వర్షాలపై సమీక్ష సందర్భంగా సెలవు అంశంపై నిర్ణయం తీసుకోవాలని సీఎస్‌కు సీఎం కేసీఆర్‌ సూచించారు. ఈ మేరకు మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అయితే రెవెన్యూ, పోలీస్, ఫైర్‌ సర్వీసులు, మున్సిపల్, పంచాయతీ రాజ్, నీటిపారుదల శాఖ, రోడ్లు, భవనాల శాఖలు, ఇతర అత్యవసర సర్వీసుల ఉద్యోగులు మాత్రం విధి నిర్వహణలో ఉండాలని 
ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.  (చదవండి: భారీ వర్షాలపై సమీక్ష నిర్వహించిన సీఎం కేసీఆర్‌ )

పరీక్షలన్నీ వాయిదా.. 
రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న, వచ్చే రెండు, మూడు రోజుల్లో జరగాల్సిన అన్నిరకాల పరీక్షలను వాయిదా వేస్తున్నట్టు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రకటించారు. 28, 29 తేదీల్లో జరగాల్సిన ఇంజనీరింగ్, డిగ్రీ పరీక్షలు కూడా వాయిదా వేసినట్టు తెలిపారు. ఆయా పరీక్షలను తిరిగి ఎప్పుడు నిర్వహిస్తామనేది త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. కాగా.. బ్రాహ్మణ పరిషత్తు ఆధ్వర్యంలో బెస్ట్‌ పథకానికి మంగళవారం జరగాల్సిన ఇంటర్వ్యూలను బుధవారానికి వాయిదా వేసినట్టు పరిషత్తు అడ్మినిస్ట్రేటర్‌ కె.చంద్రమోహన్‌ ప్రకటించారు.   
(చదవండి: హైదరాబాద్‌లో కాస్త తగ్గుముఖం పట్టిన వర్షం..)

మరిన్ని వార్తలు