సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి భారీ పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని ఉన్నతాధికారుల బృందం అమెరికా పర్యటనకు బయలుదేరి వెళ్లింది. కేటీఆర్తోపాటు పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, వివిధ శాఖల అధికారులు శనివారం ఉదయం హైదరాబాద్ నుంచి అమెరికా పయనమయ్యారు. అమెరికాలోని లాస్ ఏంజెలస్, శాన్ డియాగో, బోస్టన్, న్యూయార్క్ వంటి నగరాల్లో పర్యటించి పలు కంపెనీల అధిపతులతో సమావేశమవుతారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి.
వారం రోజులకుపైగా కొనసాగనున్న ఈ పర్యటనలో ఐటీ, ఎలక్ట్రానిక్స్, ఫుడ్ ప్రాసెసింగ్, లైఫ్ సైన్సెస్, ఫార్మా రంగాలకు చెందిన కంపెనీలతో కేటీఆర్ సమావేశం కానున్నారు. కాగా, తన అమెరికా పర్యటనపై కేటీఆర్ ట్వీట్ చేశారు. ‘ఐదేళ్ల తరువాత వర్క్ ట్రిప్ కోసం యునైటెడ్ స్టేట్స్ వెళుతున్నా ను. రానున్న వారంలో పశ్చిమ, తూర్పు తీరం లో ఉత్తేజకరమైన సమావేశాలు జరుగుతాయి. కచ్చితమైన కార్యాచరణతో నాప్రయాణం సాగుతుందని భావిస్తున్నాను’అని ట్వీట్ చేశారు.