మందుకొట్టి.. గొడ్డలి పట్టి కానిస్టేబుల్‌పై దాడి 

19 Oct, 2022 14:37 IST|Sakshi

సాక్షి, మెదక్‌: డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో వాహనం స్వాదీనం చేసుకున్నారన్న కోపంతో ఒక మందుబాబు గొడ్డలితో కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. ఈ సంఘటన మెదక్‌ జిల్లా తూప్రాన్‌ పట్టణంలో మంగళవారం జరిగింది. తూప్రాన్‌ డీఎస్పీ యాదగిరిరెడ్డి తెలిపిన వివరాలివి. పట్టణంలోని నర్సాపూర్‌ వంతెన వద్ద పోలీసులు వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలోనే మున్సిపల్‌ పరిధిలోని రావెల్లి గ్రామానికి చెందిన మల్లేశ్‌యాదవ్‌ తన ద్విచక్రవాహనంపై అటు వస్తున్నాడు. పోలీసులు అతని వాహనం ఆపి తనిఖీ చేశారు. డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌లో మద్యం తాగినట్టు తేలడంతో వాహనాన్ని స్వాధీనం చేసుకొని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

దీంతో కోపోద్రిక్తుడైన మల్లేశ్‌యాదవ్‌ తన ఇంటికి వెళ్లి.. కాసేపటికి నర్సాపూర్‌ వంతెన వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్న చోటికి చేరుకున్నాడు. తన బైక్‌ స్వాధీనం చేసుకున్న కానిస్టేబుల్‌ ఆఫీజ్, హోంగార్డు ఇలియాస్‌పై వెంట తెచ్చుకున్న గొడ్డలితో దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఆఫీజ్‌ తలపై రెండు చోట్ల తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే కానిస్టేబుల్‌ను ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మల్లేశ్‌యాదవ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.   

మరిన్ని వార్తలు