రిపబ్లిక్‌ వేడుకల్లో తెలుగు కళారూపం

21 Jan, 2022 02:13 IST|Sakshi
కలంకారీ పెయింటింగ్‌ వేస్తున్న సుధీర్‌ 

రాజ్‌పథ్‌ రిపబ్లిక్‌ డే వేడుకల్లో సుధీర్‌ కలంకారీ పెయింటింగ్‌ 

సాక్షి, హైదరాబాద్‌: తెలుగు కలంకారీ కళాకారుడు సుధీర్‌కు అరుదైన గుర్తింపు లభించింది. దేశ రాజధాని ఢిల్లీలో జరగనున్న రిపబ్లిక్‌ వేడుకల్లో సుధీర్‌ కలంకారీ కళారూపానికి చోటు దక్కింది. పంజాబ్‌లోని రాజ్‌పురా చిట్కారా విశ్వవిద్యాలయంలోని కళాకుంభ్‌లో స్క్రోల్‌ తయారీ ప్రక్రియలో భాగంగా ఉన్న కొన్ని సంప్రదాయ రీతులను ఈ నెల 26న గణతంత్ర దినోత్సవ కవాతు సందర్భంగా న్యూఢిల్లీ రాజ్‌ పథ్‌లో ప్రదర్శించనున్నారు.

ఇందులో భాగంగా రాజ్‌పథ్‌లోని ఓపెన్‌ గ్యాలరీలో నేషనల్‌ గ్యాలరీ ఆఫ్‌ మోడరన్‌ ఆర్ట్‌ (ఎన్‌జీఎంఎ) భారీ స్క్రోల్స్‌ను ప్రదర్శించనున్నారు. దేశవ్యాప్తంగా ఉన్న 500 మందికి పైగా కళాకారులు (వీటి పొడవు ఒక్కొక్కటి 750 మీటర్లు) దీనిని చిత్రించారు.  

కళారూపాల జాబితాలో కలంకారీ కళారూపం 
గణతంత్ర దినోత్సవ ప్రదర్శనకు ఎంపిక చేసిన ప్రతిష్టాత్మక కళారూపాల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌లోని శ్రీకాళహస్తికి చెందిన కళాకారుడు సుధీర్‌ రూపొందించిన కళారూపం కూడా ఉండటం విశేషం. సుధీర్‌ అనేక ప్రతిష్టాత్మక పురస్కారాలను అందుకున్న సంప్రదాయ కలంకారీ కళాకారుడు.  కలంకారీ అనేది సహజమైన రంగులను ఉపయోగించి, చింతపండు, పెన్నుతో కాటన్‌ లేదా సిల్క్‌ ఫ్యాబ్రిక్‌పై చేసే చేతి పెయింటింగ్‌ పురాతన శైలి.

ఈ కళలో డైయింగ్, బ్లీచింగ్, హ్యాండ్‌ పెయింటింగ్, బ్లాక్‌ ప్రింటింగ్, స్టార్చింగ్, క్లీనింగ్‌ ఇంకా మరెన్నో 23 శ్రమతో కూడిన దశలుంటాయి. కలంకారీలో గీసిన మోటిఫ్‌లు, పువ్వులు, నెమలి, పైస్లీలు మొదలు మహాభారతం, రామాయణం వంటి హిందూ ఇతిహాసాల దైవిక పాత్రల వరకు విస్తరించి ఉంటాయి. 

మరిన్ని వార్తలు