కంటోన్మెంట్‌..కేంద్ర పాలిత ప్రాంతమా?

13 May, 2021 08:42 IST|Sakshi

బాధ్యతారాహిత్యాన్ని సహించం: కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఫైర్‌ 

సాక్షి, కంటోన్మెంట్‌: కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించి.. రక్షణ మంత్రి ప్రారంభించిన ఆస్పత్రిని ఐదేళ్లుగా నిరుపయోగంగా ఉంచుతారా.. అని కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కంటోన్మెంట్‌ బోర్డు అధికారులపై మండిపడ్డారు. బొల్లారంలోని సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ కంటోన్మెంట్‌ జనరల్‌ ఆస్పత్రి(సీజీహెచ్‌)ని మంత్రి బుధవారం సందర్శించారు.

సీజీహెచ్‌ను కోవిడ్‌ ఆస్పత్రిగా మారుస్తూ చేపట్టిన పనులను సమీక్షించారు. ఐదేళ్ల క్రితమే నిర్మించిన ఈ ఆస్పత్రిని నేటికీ ఎలాంటి వైద్య అవసరాలకు వినియోగించకపోవడమేంటని బోర్డు అధ్యక్షుడు అభిజిత్‌ చంద్ర, సీఈఓ అజిత్‌రెడ్డిని ప్రశ్నించారు. కంటోన్మెంట్‌ అంటే ఓ కేంద్ర పాలిత ప్రాంతంగా వ్యవహరిస్తున్నారని, ప్రజలకు జవాబుదారీగా ఉండటం లేదన్నారు.

ఆస్పత్రి నిర్వహణకు అవసరమైన నిధుల వివరాలతో లేఖ రాస్తే కేంద్రం నుంచి ఇప్పిస్తానని మంత్రి బోర్డు అధికారులకు సూచించారు. అనంతరం వ్యాక్సినేషన్‌ కోసం వచ్చిన వారి వద్దకు వెళ్లి పలకరించారు.  అనంతరం కిషన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. కంటోన్మెంట్‌ జనరల్‌ ఆసుపత్రిని కోవిడ్‌ సెంటర్‌గా మార్చాలని కేంద్రం ఆదేశించిందని, యుద్ధప్రాతిపదికన పనులు కొనసాగుతున్నాయన్నారు.
చదవండి: ‘108 అంబులెన్సులు ఎక్కడికి పోయాయి’: వైఎస్‌ షర్మిల

మరిన్ని వార్తలు