ఆర్‌బీఐ రిపోర్ట్‌లోనూ అదే ఉంది: కేటీఆర్‌

28 Oct, 2020 13:22 IST|Sakshi

ఏ ఎన్నికలు వచ్చినా గెలుపు మాదే

దుబ్బాకలో గతంలో కంటే ఎక్కువ మెజారిటీ

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు దక్కవు

సాక్షి, హైదరాబాద్‌: రైతాంగానికి నేరుగా డబ్బులు అందించిన ఘనత తెలంగాణదని, ఆర్‌బీఐ విడుదల చేసిన రిపోర్ట్‌లో కూడా ఇదే స్పష్టమైందని మంత్రి కల్వకుంట్ల తారక రామారావు(కేటీఆర్‌) పేర్కొన్నారు. బుధవారం తెలంగాణ భవన్‌లో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ... తమ ప్రణాళిక సంఘం విడుదల చేసిన రిపోర్ట్‌లో తెలంగాణ తలసరి ఆదాయం పెరిగిందని తెలిపిందన్నారు. రైతుబంధు లబ్ధిదారులు చిన్న, సన్నకారు రైతులే అని తేలిందన్నారు. వాస్తవాల్ని ప్రతిపక్షాలు ఒప్పుకుంటాయో లేదో చూడాలన్నారు. తెలంగాణల అప్పులో ఉందని మొత్తుకుంటున్నారు.. కానీ రాష్ట్ర ఆదాయం పెరిగిందని గుర్తించాలన్నారు.

అదే విధం‍గా షీ టీమ్స్ పైన కూడా ఒక మంచి రిపోర్ట్ వచ్చిందని తెలిపారు. ఏ ఎన్నికలు వచ్చినా కేసీఆర్ తీసుకున్న పథకాల వల్లే టీఆర్ఎస్ గెలుస్తుందని, అసాధారణ ఫలితాలు ప్రజలు ఇస్తున్నారన్నారు. దుబ్బాక ఎన్నికలో కూడా తామే గెలుస్తున్నామని గతంలో కంటే కూడా ఎక్కువ మెజారిటీ వస్తుందని ఆయన దీమా వ్యక్తం చేశారు. ప్రజల ఆలోచన సరళి, విశ్వాసం టీఆర్ఎస్ పైనే ఉందని.. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు డిపాజిట్లు రావని అర్థం అవుతుందన్నారు. బీజేపీ, కాంగ్రెస్ నేతలు సోషల్ మీడియాకు మాత్రమే ఎక్కువ అని, ప్రజలకు చేసిందేమీ ఉండదు మంత్రి విమర్శించారు.

మరిన్ని వార్తలు