Hyderabad: అయ్యో పాపం.. పసికందును రేకుల ఇంటిపై వదిలివేత

9 Feb, 2023 09:10 IST|Sakshi
 పసికందును ఆస్పత్రికి తీసుకెళ్తున్న స్థానికులు   

సాక్షి, హైదరాబాద్‌: కన్నబిడ్డను చూసి నోరులేని మూగజీవి సైతం మురిసిపోతుంది. తనివితీరా బిడ్డను చూసుకుని పురిటి నొప్పులను సైతం మరిచిపోతుంది. ప్రపంచంలో తెంచుకోలేనిది పేగు బంధం అంటారు. అలాంటిది ఓ తల్లి తన కన్నబిడ్డ పేగు సైతం ఎండకముందే ఆ బంధాన్ని తెంచేసుకుంది. తల్లి చనుబాల రుచిని సైతం ఎరగని చిన్నారిని ఓ రేకుల ఇంటిపై ఉంచి వెళ్లిపోయారు. స్థానికులు చూసి ఆస్పత్రికి తరలించారు.

అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన జీడిమెట్ల డివిజన్‌ డివిజన్‌ పరిధిలోని అయోధ్యనగర్‌లో బుధవారం చోటుచేసుకుంది. ప్రత్యక్ష సాక్షుల కథనం ప్రకారం.. ఉదయం 6 గంటలకు ఓ ఇంటిపై ఉన్న యువకుడు.. కింద నుంచి చిన్నారి ఏడుస్తున్న శబ్దాలను విన్నాడు. కిందకు చూడగా ఓ రేకుల ఇంటిపై పసికందు కనిపించింది.

ఈ విషయాన్ని చుట్టుపక్కల వారికి చెప్పడంతో చిన్నారిని రేకుల ఇంటి నుంచి కిందకు తీసి పోలీసులకు సమాచారం అందించారు. పసికందుకు షాపూర్‌నగర్‌లో ప్రథమ చికిత్స అందించి నిలోఫర్‌ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న చిన్నారి మధ్యాహ్నం మృతి చెందింది. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. 
చదవండి: Telangana: రాష్ట్ర జనాభా మూడున్నర కోట్లు..

మరిన్ని వార్తలు