జనశక్తి రాష్ట్ర నేత నర్సింహ్మ అరెస్టు

23 Mar, 2022 01:38 IST|Sakshi
బొమ్మని నర్సింహ్మ  

సాక్షి, హైదరాబాద్‌/చౌటుప్పల్‌: సీపీఐ (ఎంఎల్‌) జనశక్తి రాష్ట్ర నేత, ఒడిశా రాష్ట్ర మాజీ కార్య దర్శి బొమ్మని నర్సింహ్మ అలియాస్‌ ఆనంద్‌ను మంగళవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇటీవలే హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌లో ఉంటున్న భార్యా పిల్లల వద్దకు వెళ్లారు. నర్సింహ్మను వెంటనే విడుదల చేయాలని డిమాండ్‌ చేయడంతోపాటుగా ఆయన అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నట్లు కుటుంబసభ్యులు పేర్కొన్నారు.

గతంలోనూ సిరిసిల్ల పోలీసులు హైదరాబాద్‌లో అరెస్టు చేసి వారం రోజులు హింసించి గజ్వేల్‌ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అరెస్టు చేసినట్లు చూపించారని, ఇప్పుడు కూడా సిరిసిల్ల పోలీసులే ఆయనను అరెస్టు చేసినట్లు భార్య పద్మ ఆరోపించారు. పోలీసులు అరెస్టు చేసి తీసుకెళ్లిన నర్సింహ్మకు ఆరోగ్యం బాగోలేదని, ఆయనను వెంటనే కోర్టులో హాజరు పరచాలని సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి సాధినేని వెంకటేశ్వర్‌రావు ఓ ప్రకటన లో డిమాండ్‌ చేశారు.

యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం అంకిరెడ్డిగూడెంకు చెందిన బొమ్మని చంద్రయ్య–పెంటమ్మ దంపతులకు తొలి సంతానంగా నర్సింహ్మ(59) జన్మించారు. వరంగల్‌లో విద్యాభ్యాసం చేసే క్రమంలో వైద్య విద్యలో వచ్చిన సీటును వదులుకుని ఉద్యమాలకు ఆకర్షితుడై అడవిబాటపట్టారు.  

మరిన్ని వార్తలు