ప్రజాధనం ఎలా ఖర్చు చేస్తారో వివరించండి: తెలంగాణ హైకోర్టు

4 Aug, 2021 13:45 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కోర్టు ధిక్కరణ కేసుల విచారణ కోసం ఖర్చుల కోసం కేటాయించిన నిధులపై తెలంగాణ హైకోర్టు విస్మయం వ్యక్తం చేసింది. రూ.58 కోట్లు మంజూరుపై బుధవారం న్యాయస్థానం విచారణ చేపట్టింది. నిధులు విడుదల చేయవద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కోర్టు ధిక్కరణ కేసుల కోసం రూ.58 కోట్లు మంజూరు చేయడమేమిటని ధర్మాసనం ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

ప్రజాధనం ఎలా ఖర్చు చేస్తారో వివరించాలని అత్యున్నత న్యాయస్థానం కోరింది. ట్రెజరీ నిబంధనలు ఎలా అనుమతిస్తాయో చెప్పాలని హైకోర్టు రెవెన్యూ, ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శులకు ఆదేశించింది. ఈ సందర్భంగా సీసీఎల్‌ఏ, ట్రెజరీ డైరెక్టర్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌కు వ్యక్తిగత హోదాలో హైకోర్టు నోటీసు ఇచ్చింది. తదుపరి విచారణ అక్టోబర్ 27వ తేదీకి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు