సహకారమే డీలా !

18 Sep, 2013 02:36 IST|Sakshi

మహబూబ్‌నగర్, సాక్షి ప్రతినిధి:  అంగట్లో అన్ని ఉన్నా అల్లుడి నోట్లో శని.. అనే చందంగా మారింది మోజర్ల హార్టికల్చర్ యూనివర్శిటీ  పరిస్థితి. పండ్లతోటలు, కూరగాయలు, పూల మొక్కల సాగుపై పరిశోధన, సుగంధ ద్రవ్యాలు, ఔషధ మొక్కలపై పరిశోధనలు చేసేందుకు అ న్ని అవకాశాలు ఉన్నా.. యూనివర్శిటీకి అవసరమైన స్థలం లేకపోవడంతో అందుకు వీలుపడటం లేదు. ఇక్కడి యూనివర్శిటీలో పరిశోధనలు చేసేందుకు అవసరమైన పరికరాలు, ప్రయోగశాలలను ఏర్పాటు చేసి అందుకు తగ్గట్టుగా ప్రభుత్వం శాస్త్రవేత్తలు, ఇతర సిబ్బందిని నియమించింది. వారి సేవలను సద్వినియోగం చేసుకోలేని ప రిస్థితి దాపురించింది.
 
 జిల్లాలో ఉన్న వాతావరణ పరిస్థితుల ను బట్టి చూస్తే పండ్లతోటలు, కూరగాయలతో పాటు పూల తోటలు పెంచితే మంచి ఆదాయం వస్తుంది. ఆ విధంగా రై తులు ఆర్థికంగా నిలుదొక్కుకునేందుకు వీలుగా జిల్లాలో ఏ యేరకాల పండ్లతోటలు సాగుచేస్తే బాగుంటుందో పరిశోధనలు చేసేందుకు వీలుగా దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై ఎస్ రాజశేఖరరెడ్డి కొత్తకోట మండలం మోజర్ల సమీపంలో హార్టికల్చర్ యూనివర్శిటీ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నా రు. పండ్లతోటలు సాగు చేసేందుకు ముందుకొచ్చే రైతుల కు పూర్తి సహాయ సహకారాలు అందించేందుకు వీలుగా అక్కడ శాస్త్రవేత్తలన కూడా నియమించారు.
 
 ఇవే సమస్యలు!
 యూనివర్శిటీకి 200 నుంచి 250 ఎకరాలు కేటాయిస్తే వాటిలో అవసరమైన పండ్ల మొక్కలు పెంచి వాటిపై పరిశోధనలు చేసేందుకు అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 30 ఎకరాలు మాత్రమే కేటాయించడంతో పరిశోధనలకు ఇబ్బందికరంగా మారింది. జిల్లా రైతులకు మేలు చేయాలనే ఉద్దేశంతోనే అవసరమైన భూమిని కేటాయించాలని యూనివర్సిటీ శాస్త్రవేత్తలు జిల్లా అధికారుల చుట్టూ తిరుగుతున్నా అందుకు ప్రజాప్రతినిధులు సహకరించకపోవడంతో అడ్డంకులు ఏర్పడుతున్నాయి.
 
 స్థానిక రైతులు పండ్లతోటలను పెంచి మార్కెట్ చేయలేని పరిస్థితుల్లో యూనివర్శిటీలో నిల్వ ఉంచేందుకు వసతుల కల్పనకు రూ.25 లక్షలు మంజూరయ్యాయి. స్థానిక యూనివర్శిటీలో పరిశోధనలు నిర్వహించడానికి అనుకూల పరిస్థితులు లేకపోయినా పోస్టు గ్రాడ్యుయేషన్‌లో చేరేందుకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చర్ రీసెర్చ్ (ఐసీఏఆర్) ఆధ్వర్యంలో నిర్వహించిన పరీక్షలో రాష్ట్రంలో ఏ యూనివర్శిటీలో లేని విధంగా ఇక్కడ చదివిన 10 మంది విద్యార్థులు ప్రతిభ కనబరచి ఇతర రాష్ట్రాల్లో సీట్లు సంపాదించుకోవడం విశేషం..
  వీరిలో ఎస్.మల్లేశ్ (బాగల్‌కోట్ యూనివర్శిటీ), బి.అశోక్ కుమార్ (ఇంఫాల్) ఏ.ప్రశాంత్ కుమార్ (అస్సాంలోని జోర్‌హట్) టి.రఘునంద న్ (ఉత్తర్ ప్రదేశ్), వి.రాకేష్ శర్మ (మీరట్), సీహెచ్ రాకేష్ (బాగల్‌కోట్), యం.రంజిత్ కుమార్ (గుజరాత్), పి.తనూజ (శిమోగ, కర్ణాటక), జి.అనుష, ఎల్. భీమ్‌లాల్, తులసీరాం (అకోలా, మహారాష్ట్ర)యూనివర్శిటీల్లో పోస్టు గ్రాడ్యుయేషన్ చేస్తున్నారు.
 
 ఈ ఏడాది నుంచి జిల్లాలో ఉన్న హార్టికల్చర్  యూనివర్శిటీలో పీజీ కోర్సును అమలుచేస్తున్నారు. ప్రస్తుతం కూరగాయల సాగుకు సంబంధించి కొత్త వంగడాలను కనుగొనేందుకు పరిశోధనలు ప్రారంభించనునున్నట్లు అసోసియేట్ డీన్ డాక్టర్ రావి చంద్రశేఖర్ వెల్లడించారు. ఈ ఏడాది సీహెచ్ జగదీష్ (శ్రీకాకుళం), ఎన్.ప్రమోద్‌కుమార్ (కరీంనగర్) పీజీ కోర్సులో చేరారు.
 
 పండ్ల మొక్కల సాగుపై
 శిక్షణ ఇవ్వడానికి మేం సిద్ధం
 పండ్లమొక్కల సాగు విధానం తెలుసుకునేందుకు ముందుకొచ్చే రైతులకు సలహాలతో పాటు  శిక్షణ ఇవ్వడానికి కూడా మేము సిద్ధంగా ఉన్నాం. పండించిన ధాన్యాన్ని విక్రయించేందుకు వ్యవసాయ మార్కెట్ కమిటీకి వచ్చే రైతులు టెక్నాలజీ వినియోగించుకోవాలని ఉత్సాహం చూపితే తమ సిబ్బందే వారి వద్దకు వెళ్లి అవసరమైన సూచనలు, సలహాలు ఇస్తాం.. గ్రామీణప్రాంతాల్లో సాగుచేసిన పంటల పరిస్థితిపై అధ్యయనం చేయడానికి యూనివర్శిటీలో ఫైనల్ ఈయర్ చ దివే విద్యార్థులను నాలుగు నెలల పాటు ఫీల్డ్‌కు పంపుతామన్నారు. జిల్లాలో పండ్లతోటలను రైతులు పెద్దగా సాగు చేయకపోవడంతో విద్యార్థులను రంగారెడ్డి జిల్లాకు పంపాల్సి వచ్చింది. పండ్ల తోటలకు సోకే తెగుళ్లు, వాటి నివారణ తదితర వాటి కోసం రైతులు నేరుగా ఫోన్లో సంప్రదించినా అవసరమైన సూచనలు, సలహాలు అందజేస్తాం. వాటిని నివృత్తి చేసుకునే రైతులు సెల్: 9866558986 లేదా 9866550747 ఫోన్ నెంబర్లను సంప్రదించవచ్చు.
 -  డాక్టర్ రావి చంద్రశేఖర్
 

మరిన్ని వార్తలు