రోడ్డు ప్రమాదంలో ‘గూగుల్’ ఉద్యోగిని దుర్మరణం

12 Dec, 2013 03:30 IST|Sakshi

రాప్తాడు, న్యూస్‌లైన్ : మరూరు వద్ద 44వ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ‘గూగుల్’ కంపెనీ ఉద్యోగిని దుర్మరణం చెందింది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... తిరుపతిలోని ఎన్జీవో కాలనీకి చెందిన సుదర్శిని (30) హైదరాబాద్‌లో గూగుల్ కంపెనీలో పని చేస్తోంది. తోటి ఉద్యోగి థామస్‌జాన్‌తో కలిసి కంపెనీ పనిపై ఇటీవల కేరళకు వెళ్లారు.

 

అక్కడ పని ముగించుకుని బుధవారం బెంగళూరు చేరుకున్నారు. అక్కడి నుంచి హైదరాబాద్‌కు కారులో బయల్దేరారు. మరూరు వద్దకు రాగానే టైరు పంక్చర్ కావడంతో వేగంలో అదుపుతప్పి కుడి వైపునకు తిరిగి డివైడర్‌ను ఢీకొంది. ముందుభాగంలో ఎడమవైపు సీట్లో కూర్చున్న సుదర్శినికి డివైడర్ ఇనుపచువ్వలు తగిలి తల నుజ్జునుజ్జయ్యి అక్కడికక్కడే మృతిచెందింది. డ్రైవింగ్ చేస్తున్న థామస్‌జాన్‌కు ఎటువంటి గాయాలూ కాలేదు. మృతురాలికి ఒక కూతరు ఉంది. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. ఎస్‌ఐ తమీమ్ అహమ్మద్ కేసు దర్యాప్తు చేస్తున్నారు.
 

మరిన్ని వార్తలు