మన బడి ‘నాడు– నేడు’  కార్యక్రమానికి శ్రీకారం

23 Oct, 2019 07:40 IST|Sakshi
సర్వే చేస్తున్న ఎస్‌ఎస్‌ఏ, విద్యాశాఖ అధికారులు 

మన బడికి వసతుల కల్పన

జిల్లాలో తొలిదశలో 1059 పాఠశాలలు ఎంపిక

నవంబర్‌ 14 నుంచి ప్రారంభించేలా ఏర్పాట్లు 

ఇంజనీరింగ్‌ అధికారుల కసరత్తు  

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి మాటకు కట్టుబడి ముందుకు సాగుతున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన దిశగా అడుగులు వేస్తున్నారు. పాఠశాలలను ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకొచ్చే దిశగా చర్యలు తీసుకుంటున్నారు. అందులో భాగంగా మన బడి నాడు – నాడు నేడు అనే వినూత్న కార్యక్రమానికి విద్యాశాఖ శ్రీకారం చుడుతోంది. ఇందుకోసం ప్రభుత్వం రూ.1500 కోట్లు నిధులను కూడా కేటాయించింది. వచ్చేనెల 14న రాష్ట్ర ముఖ్యమంత్రి లాంఛనంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. 

సాక్షి, కడప: మన బడి నాడు నేడు కార్యక్రమం అమలుకు అధికారులు కసరత్తు ప్రారంభించారు. ప్రభుత్వ పాఠశాలలు ప్రస్తుతం ఎలా ఉన్నాయి. మూడేళ్ల తరువాత ఎలా ఉండబోతున్నాయనే విషయాన్ని పోటోలతో సహా ప్రజల ముందు ప్రభుత్వం ఉంచాలని సంకల్పించిన నేపథ్యంలో అధికారులు ప్రణాలికను అమలు చేస్తున్నారు. తొలి విడతలో 50 మండలాల్లోని 1059 పాఠశాలలను గుర్తించారు.  718 ప్రాథమిక పాఠశాలలు, 161 ప్రాథమికోన్నత పాఠశాలలు, 180ఉన్నత పాఠశాలలను ఎంపిక చేశారు. ప్రతి మండలం కవర్‌ ఆయ్యేలా పాఠశాలల ఎంపిక చేశారు. వీటిలో మౌలిక వసతుల కల్పన పర్యవేక్షణ బాధ్యతలను సర్వశిక్ష అభియాన్, సాంఘీక సంక్షేమ, గిరిజన సంక్షేమ ఇంజనీరింగ్‌ అధికారులకు ప్రభుత్వం అప్పగించింది. ఆయా శాఖల అధికారులు ఎంపిక చేసిన పాఠశాలల్లో ప్రతిపాదిత పనులు, సౌకర్యాలను వచ్చే ఏడాది మార్చిలోపు పూర్తి చేశాలా ప్రభుత్వం షెడ్యూల్‌ను ఖరారు చేయనుంది. 

తొమ్మిది అంశాల ప్రాధాన్యతతో.. 
మన బడి  నాడు – నేడు కార్యక్రమంలో 9 అంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. ముగురుదొడ్లు, తాగునీరు, పెయింటింగ్, విద్యుత్‌ సౌకర్యం, మేజర్, మైనర్‌ రిపేర్లు, అదనపు తరగతుల నిర్మాణం, బ్లాక్‌బోర్డు ఏర్పాటు , పాఠశాలలకు ప్రహారీల నిర్మాణాల వంటివాటిపై దృష్టిని సారించాలని సూచించారు.  3203 పాఠశాలలకు గాను ఇప్పటి వరకు 82,604 ఫొటోలను   యాప్‌లో  ఆప్‌లోడ్‌ చేశారు. పాఠశాలలకు మౌలిక వసతులు కల్పించిన తరువాత అప్పుడు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉన్నాయని ఫోటోలతో సహా ప్రజల ముందు ఉంచుతారు. 

యాప్‌లో ఫొటోలు అఫ్‌లోడ్‌ అయినట్లు వచ్చిన సక్సెస్‌ మేసేజ్‌  
ప్రతిపాదనలు సిద్దం చేస్తున్నా.. 
జిల్లావ్యాప్తంగా గుర్తించిన పాఠశాలలపై ప్రతిపాదనలను సిద్ధం చేస్తున్నాం. ఏఏ పాఠశాలలకు ఏమేరకు వసతులు కల్పించాలనే దానిపై కసరత్తు చేస్తున్నాం. నవంబర్‌ 14వ తేదీనాటికి అన్ని సిద్దం చేసి పనులను మొదలు పెడతాం. 
– అంబవరం ప్రభాకర్‌రెడ్డి, ఎస్‌ఎస్‌ఏ ప్రాజెక్టు అధికారి 

మరిన్ని వార్తలు