జియో దెబ్బకు ఎయిర్‌టెల్‌, ఐడియా పతనం

11 May, 2018 12:30 IST|Sakshi

ముంబై : ముకేష్ అంబానీ నేతృత్వంలోని రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ కొత్త పోస్టుపెయిడ్‌ ప్లాన్‌ రూ.199తో టెలికాం దిగ్గజ కంపెనీలు ఎయిర్‌టెల్‌, ఐడియాలకు షాకిచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా తీసుకొచ్చిన ఈ ప్లాన్‌పై అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌, ఎస్‌ఎంఎస్‌, డేటా ప్రయోజనాలతో పాటు అంతర్జాతీయ కాలింగ్‌ సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. జియో దెబ్బకు భారతీ ఎయిర్‌టెల్‌, ఐడియా సెల్యులార్‌లు ఒక్కసారిగా ఢమాల్‌మన్నాయి. శుక్రవారం ట్రేడింగ్‌ సెషన్‌లో ఐడియా షేర్లు 8.1 శాతం మేర క్షీణించాయి. ఇది 2011 ఫిబ్రవరి నాటి కనిష్ట స్థాయిలు. 

అదేవిధంగా ఎయిర్‌టెల్‌ షేర్లు కూడా 5.8 శాతం కిందకి పడిపోయాయి. ఇప్పటికే తీవ్రంగా నష్టపోతున్న ఈ టెలికాం కంపెనీలను, ఎప్పడికప్పుడూ జియో దెబ్బతీస్తూనే ఉంది. ప్రస్తుతం జియో తీసుకొచ్చిన ఈ ప్లాన్‌కు కౌంటర్‌గా తాము ఎలాంటి ప్లాన్‌లను ప్రకటించాలి? అని కంపెనీలు యోచిస్తున్నాయి. త్వరలోనే ఈ కంపెనీలు కూడా కొత్త ప్లాన్లను ప్రకటించే అవకాశాలున్నాయని జెఫెరీస్‌ పేర్కొంది. దీంతో ఒక్కో యూజర్‌తో పొందే సగటు రెవెన్యూ పడిపోనుంది. ఒకవేళ పోస్టు పెయిడ్‌ ధరల్లో 10 శాతం కోత పెడితే, ఈబీఐటీడీఏలు ఐడియావి 12 శాతం, ఎయిర్‌టెల్‌ కంపెనీలు 6 శాతం తగ్గిపోయే అవకాశాలున్నాయని జెఫెరీస్‌ తెలిపింది.
 

మరిన్ని వార్తలు