వాట్సాప్‌కు షాక్‌ : న్యూ లుక్‌తో కింభో రీలాంచ్‌

15 Aug, 2018 18:37 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌కు గుండెల్లో గుబులు పుట్టించేలా కింభో మళ్లీ వార్తల్లోకొచ్చేసింది. ఈ నెలలోనే ఈ కింభో యాప్‌ కస‍్టమర్లకు అందుబాటులోకి రానుంది. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా పతంజలి  సంస్థ సీఈవో ఆచార్య బాలకృష్ణ వెల్లడించారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌ ఖాతాలో ఒక మెసేజ్‌ పోస్ట్‌ చేశారు. కొత్త, ఆధునిక ఫీచర్లు కింభో యాప్‌ లాంచింగ్‌కు సిద్ధంగా ఉన్నామంటూ ట్వీట్‌ చేశారు.

కింభో యాప్‌ను ఆగష్టు 27, 2018 న ప్రారంభించనున్నామని బాలకృష్ణ ట్వీట్‌ చేశారు. ఈ యాప్‌ ట్రయిల్‌ వెర్షన్‌ను ప్రస్తుతం గూగుల్ ప్లే స్టోర్‌లో వినియోగదారులు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు.  అంతేకాదు లాంచింగ్‌కు  ముందే యూజర్లు తమ సలహాలు, సూచనలు అందించాలని కోరారు.

కాగా యోగా గురు బాబా రామ్‌దేవ్‌కు చెందిన పతంజలి సంస్థ వాట్సాప్‌కు పోటీగా కింభో పేరిట కొత్త  స్వదేశీ మెసేజింగ్ తీసుకురానున్నట్టు ఈ ఏడాది  మే 31న ప్రకటించారు. అచ్చం వాట్సాప్‌ను పోలిన ఫీచర్లతో కింభో యాప్‌ను రామ్‌దేవ్‌ విడుదల చేశారని పతంజలి గ్రూప్‌ ప్రతినిధి ఎస్‌కే తిజారావాలా తన ట్విట్టర్  ద్వారా వెల్లడించారు. సంస్కృతంలో కింభో అంటే ఎలా ఉన్నారు, ఏంటి విశేషాలు? అనే అర్థాలు వస్తాయని ఈ సందర్భంగా తిజారావాలా తెలిపారు. అయితే  సెక్యూరిటీ కారణాల రీత్యా గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి కింభో అదృశ్యమైన సంగతి తెలిసిందే.

మరిన్ని వార్తలు