ఆర్‌బీఐ మూడు రోజుల పాలసీ సమీక్ష ప్రారంభం

31 Jul, 2018 01:35 IST|Sakshi

ముంబై: రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య విధాన కమిటీ (ఎంపీసీ) మూడు రోజుల సమావేశం సోమవారం ప్రారంభమైంది. 2018–19లో ఇది మూడవ ద్వైమాసిక సమావేశం. గవర్నర్‌ ఉర్జిత్‌ పటేల్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ఈ కమిటీ బుధవారం (ఆగస్టు 1) తన కీలక నిర్ణయాలను ప్రకటించనుంది. ఈ సందర్భంగా బ్యాంకులకు తానిచ్చే రుణ రేటు– రెపోపై (ప్రస్తుతం 6.25 శాతం) ఏ నిర్ణయం తీసుకుంటారనేది ఆసక్తికరంగా మారింది.

ద్రవ్యోల్బణం దాదాపు 5 శాతం వద్ద ఉండటం, అంతర్జాతీయంగా చమురు ధరల తీవ్రత వంటి పరిస్థితులు రెపోపై నిర్ణయానికి ప్రధాన ప్రాతిపదక కానున్నాయి. ద్రవ్యోల్బణంపై ఆందోళన నేపథ్యంలో జూన్‌ 7 పాలసీ సమావేశం సందర్భంగా రెపోరేటును ఆర్‌బీఐ పావుశాతం పెంచింది. 2014 జనవరిలో రెపో రేటును పావు శాతం పెంచిన ఆర్‌బీఐ మళ్లీ ఈ ఏడాది జూన్‌ 7నే కీలక పాలసీ రేటును పెంచింది. ఈ కాలంలో పలుమార్లు రెపోను తగ్గిస్తూ వచ్చింది. కాకపోతే, గత 2017 ఆగస్టు నుంచి పాలసీ రేట్లను యథాతథంగానే కొనసాగిస్తోంది.   

మరిన్ని వార్తలు