రతన్‌ టాటాకు ఊరట

9 Jul, 2018 12:11 IST|Sakshi

ముంబై : టాటా గ్రూప్‌ చైర్మన్‌ పదవి నుంచి సైరస్‌ మిస్త్రీ తొలగింపు వ్యవహారంలో రతన్‌ టాటాకు ఊరట లభించింది. తనను చైర్మన్‌ పదవి నుంచి అర్ధంతరంగా తొలగించారంటూ మిస్త్రీ టాటా గ్రూప్‌పై న్యాయ పోరాటం చేస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఆయన నేషనల్‌ కంపెనీ లా ట్రిబ్యూనల్‌(ఎన్‌సీఎల్‌టీ)ని ఆశ్రయించారు. తన కుటుంబానికి టాటా గ్రూప్‌లో 18.4 శాతం వాటాలున్నట్టు ఆయన పేర్కొన్నారు. రతన్‌ టాటా, టాటా సన్స్‌ బోర్డ్‌ మైనార్టీ షేర్‌ హోల్డర్స్‌ హక్కులను కాలరాస్తున్నారంటూ  ఆయన మరో అంశాన్ని కూడా తన పిటిషన్‌లో పొందుపర్చాడు. దీనిపై విచారణ చేపట్టిన ఎన్‌సీఎల్‌టీ ముంబై బెంచ్‌ మిస్త్రీ అభ్యర్థనను తొసిపుచ్చుతు సోమవారం తీర్పు వెలువరించింది. అలాగే రతన్‌ టాటాకు ఈ వ్యవహారంలో క్లీన్‌ చీట్‌నిచ్చింది.

ఎగ్జిక్యూటివ్‌ చైర్మన్‌ను తొలగించడానికి బోర్డ్‌ ఆఫ్‌ డైరక్టర్స్‌కు తగిన అధికారాలు ఉన్నాయని ట్రిబ్యూనల్‌ తెలిపింది. బోర్డ్‌ మెంబర్స్‌ మిస్త్రీపై నమ్మకం కొల్పోవడం వల్లే పదవి నుంచి తొలగించారని ట్రిబ్యూనల్‌ తన తీర్పులో పేర్కొంది. మిస్త్రీ లెవనెత్తిన వాదనలో చెప్పుకోదగ్గ అంశాలు లేవని వెల్లడించిది. ప్రస్తుత కాలంలో యాజమాన్యాలు, వాటా దారులకు జవాబుదారీ తనంగా ఉండాలని ట్రిబ్యూనల్‌ అభిప్రాయపడింది.  2016 అక్టోబర్‌లో ​టాటా సన్స్‌ బోర్డ్‌ మెంబర్స్‌ మిస్త్రీని చైర్మన్‌ బాధ్యతల నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. వారి నిర్ణయాన్ని సవాలు చేస్తూ ఆయన 2016 డిసెంబర్‌లో ఎన్‌సీఎల్‌టీలో పిటిషన్‌ దాఖలు చేశారు.

మరిన్ని వార్తలు