సాక్షి, ముంబై: దేశీయ కరెన్సీ రూపీ, డాలర్ మారకంలో బుధవారం ట్రేడింగ్లో బలహీనంగా ప్రారంభమైంది. ఆరంభంలోనే 6 పైసలు నష్టపోయి 70.90 వద్ద ప్రారంభమైంది. ఒక దశలో 70.95 కు పడిపోయింది. మరోవైపు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ తన పాలసీ రేటు నిర్ణయాన్ని నేడు (బుధవారం) ప్రకటించనుంది.దీంతో ఇన్వెస్టర్ల అప్రమత్తత ధోరణి కనిపిస్తోంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఫెడ్ ఈ సంవత్సరం వరుసగా మూడవసారి వడ్డీ రేటు తగ్గింపును ఆమోదించే అవకాశం ఉంది. దీంతో యుఎస్ డాలర్ బలహీనంగా ట్రేడవుతోంది. ఇతర కరెన్సీల లో పోలిస్తే డాలర్ ఇండెక్స్ 0.02 శాతం తగ్గి 97.70 వద్దకు చేరుకుంది. గ్లోబల్ ఆయిల్ బెంచ్ మార్క్ బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ బ్యారెల్కు 0.32 శాతం తగ్గి 61.39 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.
మంగళవారం 28పైసల లాభంతో ప్రారంభమైన రూపాయి డాలర్ మారకంలో 6 పైసలు బలహీనపడి 70.84 వద్ద ముగిసిన సంగతి తెలిసిందే. ప్రధాన కరెన్సీలతో పోలిస్తే డాలర్ బలపడడంతో రూపీ స్వల్పనష్టాలతో ముగిసింది. యుఎస్-చైనా పాక్షిక ఒప్పందం అమలు ఆలస్యం కానుందనే అంచనాల నేపథ్యంలో బంగారం ధరలు బుధవారం సెషన్లో నిలకడగా ఉన్నాయి.