నానో.. కథ ముగిసినట్టేనా!?

26 Nov, 2017 14:58 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : రతన్‌ టాటా డ్రీమ్‌ కార్‌గా గుర్తింపు తెచ్చుకున్న నానో మార్కెట్‌నుంచి తెరమరుగు కానుందా? అంటే అవుననే సమాధానం వస్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్న డీలర్లలో మెజారిటీదారులు.. నానో బుకింగ్స్‌ నిలిపేసినట్లు తెలుస్తోంది. ఆరంభంలోనే అంతంతమాత్రంగా ఉన్న బుకింగ్స్‌.. గత నాలుగు నెలలుగా మరింత తగ్గుముఖం పట్టడమే ఇందుకు కారణమని డీలర్లు చెబుతున్నారు. ఇదిలా ఉండగా గుజరాత్‌లోని సనంద్‌ ప్లాంట్‌లోనూ నానో కార్ల ఉత్పత్తి చాలా తక్కువ స్థాయిలో ఉన్నట్లు తెలుస్తోంది. ఆగస్టులో నానో కార్ల ఉత్పత్తి 180 ఉండగా.. అక్టోబర్‌ నాటికి దీనిని 5కు తగ్గించారు.


టాటా నానో కార్‌ను ప్రకటించిన సమయంలో కేవలం లక్ష రూపాయలకే సామాన్యుడికి కారు అందిస్తున్నట్లు రతన్‌ టాటా 2008లో ప్రకటించారు. తరువాత అనేక వివాదాలు, సమస్యలు, ప్లాంట్‌ తరలింపు, ఇతర కారణాల వల్ల దీని ధర మారుతూ వచ్చింది. ప్రస్తుతం నానో ధర.. రూ.2.69 లక్షలుగా ఉంది. ప్రస్తుతం టాటా మోటార్స్‌కు నానో మోడల్‌ ఒక వైట్‌ ఎలిఫెంట్‌లా మారింది.

మరిన్ని వార్తలు