వివో కీలక నిర్ణయం, ఇక ఆ డీల్స్‌ వుండవు

30 Dec, 2019 11:26 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  చైనా స్మార్ట్‌ఫోన్‌  కంపెనీ వివో  సంచలన నిర్ణయం తీసుకుంది. ఆన్‌లైన్‌ ద్వారా ప్రత్యేక ఆఫర్లతో దేశీయంగా స్మార్ట్‌ఫోన్‌ వినియోగదారులను ఆకట్టుకున్న వివో ఇండియా తాజాగా షాకింగ్‌ న్యూస్‌ చెప్పింది. వచ్చే ఏడాది (2020) నుంచి ఆన్‌లైన్‌ ఎక్స్‌క్లూజివ్ సేల్స్‌అందుబాటులో వుండవని తేల్చి చెప్పింది. రిటైలర్స్‌కు మేలు చేయాలన్న సంకల్పంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని స్పష్టం చేసింది. అయితే తమ ఉత్పత్తులను దాదాపు అవే ధరలకు మిగతా చానళ్ల ద్వారా తమ కస్టమర్లకు అందుబాటులో ఉంచుతామని వివో ఇండియా సీఈవో జెరోమ్ చెన్ వెల్లడించారు.  దీంతో వివోకు సంబంధించిన  ఉత్పతుత్లన్నీ స్టాండర్ట్ రేట్స్‌కే లభిస్తాయన్నారు. అలాగే ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లోనూ ఆఫర్లు ఉంటాయని హామీ ఇచ్చారు. 

దేశంలో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ తయారీదారులలో ఒకటిగా నిలిచిన వివో ఇక ఆఫ్‌లైన్ మార్కెట్‌పై దృష్టి పెట్టనుంది. వివో తాజా నిర్ణయాన్ని స్వాగతించిన ఆల్ ఇండియా మొబైల్ రిటైలర్స్ అసోసియేషన్ (ఐమ్రా), అన్యాయమైన ఇ-కామర్స్ వాణిజ్య పద్ధతులకు వ్యతిరేకంగా, సరసమైన వ్యాపార అవకాశాలతో మొబైల్ రిటైలర్ల కోసం కొత్త మార్పును తీసుకు వస్తున్నామని శుక్రవారం ఒక ట్వీట్‌లో పేర్కొంది. ఇందులో వివో మొబైల్స్ ఇండియా  సీఈవో లేఖ కాపీని కూడా జత చేసింది.

మరోవైపు  2020 జనవరి  మొదటి వారంలో ఎస్ 1 ప్రో పేరుతో తో కొత్త స్మార్ట్‌ఫోన్ ను లాంచ్ చేయడానికి సిద్ధంగా ఉంది. ఫుల్-హెచ్‌డి + రిజల్యూషన్‌తో 6.38-అంగుళాల సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే, స్నాప్‌డ్రాగన్ 665 సాక్‌ ప్రాసెసర్‌, 8 జీబీ ర్యామ్‌, 128 జీబీ స్టోరేజ్‌, డైమండ్ ఆకారంలో  48 మెగాపిక్సెల్ క్వాడ్ కెమెరా సెటప్  ఈ స్మార్ట్‌ఫోన్‌ను తీసుకురానుంది. 

మరిన్ని వార్తలు