మద్యం హోం డెలివరీకి జొమాటో..!

7 May, 2020 08:44 IST|Sakshi

న్యూఢిల్లీ : కరోనా లాక్‌డౌన్‌ కాలంలో మద్యం ప్రియులు ఇబ్బంది పడకుండా ఉండేందుకు కొన్ని రాష్ట్రాలు మద్యం హోం డెలివరీకి అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఇప్పటికే పంజాబ్‌, పశ్చిమ బెంగాల్‌ రాష్ట్రాలు మద్యం హోం డెలివరీ ద్వారా వినియోగదారులకు మద్యం అందజేస్తున్నారు. మరోవైపు కేంద్రం ఆదేశాల మేరకు దాదాపు 45 రోజుల తర్వాత పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకున్నాయి. ఈ క్రమంలో ప్రముఖ ఫుడ్‌ డెలివరీ సంస్థ జొమాటో కూడా మద్యం డెలివరీ రంగంలోకి ప్రవేశించాలని చూస్తున్నట్టుగా తెలుస్తోంది. లాక్‌డౌన్‌ కాలంలో మద్యానికి ఉన్న డిమాండ్‌ను సొమ్ము చేసుకోవాలని జొమాటో భావిస్తోంది. ఇందుకోసం అవసరమైన చర్చలు కూడా జరుపుతోంది. (చదవండి : పోలీస్‌ స్టేషన్‌లో మద్యం చోరీ)

భారత్‌లో మద్యం హోం డెలివరీకి సంబంధించి ఏ విధమైన చట్టపరమైన నిబంధనలు లేవు. దీంతో ఇంటర్నేషనల్‌ స్పిరిట్స్‌ అండ్ వైన్స్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా(ఐఎస్‌డబ్ల్యూఏఐ).. జొమాటో, ఇతర సంస్థలతో మద్యం హోం డెలివరీకి సంబంధించి చర్చలు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలో టెక్నాలజీ ఆధారిత హోం డెలివరీ.. బాధ్యయుత మద్యం వినియోగాన్ని ప్రొత్సహించినట్టు అవుతుందని నమ్ముతున్నట్టు జొమాటో సీఈవో మోహిత్‌ గుప్తా.. ఐఎస్‌డబ్ల్యూఏఐ ముందు ప్రతిపాదనను ఉంచారు. మరోవైపు లాక్‌డౌన్‌ నిబంధనల వల్ల రెస్టారెంట్‌లు మూసివేయడంతో జొమాటో విభిన్నంగా నిత్యావసరాలు డెలివరీ చేయడం కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే.(చదవండి : మద్యం ఇక హోం డెలివరీ..!)

కాగా, పలు రాష్ట్రాల్లో మద్యం దుకాణాలు తెరుచుకోవడంతో ప్రజలు వాటి ముందు బారులు తీరారు. ఈ రద్దీని తగ్గించేందుకు దేశ రాజధాని ఢిల్లీలో మద్యంపై 70 శాతం స్పెషల్‌ కరోనా ఫీజు విధించిన సంగతి తెలిసిందే. పలు రాష్ట్రాలు కూడా ఇదే బాటలో సాగుతున్నాయి. ముంబైలో మాత్రం మందుబాబులను అదుపు చేయలేక కేవలం రెండు రోజుల్లోనే మద్యం దుకాణాలు మూసివేశారు.

మరిన్ని వార్తలు