మద్యం మత్తులో దారుణానికి ఒడిగట్టిన తండ్రి

17 Apr, 2019 09:41 IST|Sakshi

సాక్షి, సంగారెడ్డి : జిల్లాలో అర్థరాత్రి దారుణం చోటుచేసుకుంది. భార్య పుట్టింటికి వెళ్లిపోయిందన్న కోపంతో కన్న బిడ్డల్ని కడతేర్చాడో కసాయి తండ్రి. ఈ సంఘటన సంగారెడ్డి జిల్లాలోని రామచంద్రాపురంలో మంగళవారం అర్థరాత్రి చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రామచంద్రాపురం(సైబరాబాద్‌) పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని బాంబే కాలనీలో ఎరుకల కుమార్‌.. భార్య శిరీష, ముగ్గురు సంతానంతో నివాసముంటున్నాడు. గత కొద్ది రోజులుగా భార్యాభర్తల మధ్య విభేదాలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో శిరీష.. కుమార్‌ను వదలి పుట్టింటికి వెళ్లి పోయింది.

ముగ్గురు పిల్లలు తండ్రివద్దే ఉంటున్నారు. కాగా మంగళవారం అర్థరాత్రి పూటుగా మద్యం సేవించిన కుమార్‌ విచక్షణ కోల్పోయాడు. భార్య మీద కోపాన్ని కన్న బిడ్డలపై చూపి, ముగ్గురు పిల్లలపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో కుమారుడు అఖిల్(7),కుమార్తె  శరణ్య (4) మృతి చెందగా.. పెద్ద కుమార్తె మల్లీశ్వరి కత్తి దాడినుంచి తప్పించుకుని, ప్రాణాలతో బయటపడింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

మరిన్ని వార్తలు