బాలికకు విముక్తి

12 May, 2018 13:48 IST|Sakshi
చెర నుంచి విముక్తి పొందిన బాలిక   

కొరాపుట్‌ : కొరాపుట్‌ జిల్లా దశమంతపూర్‌ సమితిలోని   మొర్చిగుడ గ్రామంలో ఇతరుల బంధనలో చిక్కుకున్న బాలికకు విముక్తి లభించింది. జిల్లా శిశు సంరక్షణ విభాగం ఆ బాలికను చెరనుంచి  విముక్తిరాలిని చేసింది. తండ్రి పరారీలో ఉండగా తల్లి మరణంతో ఆ బాలిక అనాథగా మిగిలిపోయింది. దూరపు చుట్టమైన సోదరిగా చెప్పుకున్న ఒక మహిళ  ఆ బాలికను చేరదీసింది. తన పిల్లలను ఎత్తుకోవడం, ఇంటి చాకిరీ చేయించడంతో పాటు గ్రామంలో కూలి పనులకు వినియోగించడంతో పాటు చాలీ చాలని తిండిపెడుతూ ఆ బాలికను నానా హింసలు పెడుతున్న వైనం ఈ నోట ఆ నోట జిల్లా శిశు సంరక్షణ అధికారిణి రాజశ్రీ దాస్‌ చెవికి చేరింది.

ఆమె తన బృందంతో గ్రామానికి వెళ్లి దర్యాప్తు నిర్వహించి ఆ బాలికను బాల కార్మికురాలిగా గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. జిల్లా శిశు సంక్షేమ కమిటీ ముందు శుక్రవారం హాజరు పరిచారు. ఆ బాలికను శిశు సంరక్షణ విభాగం గృహంలో ఉంచుతూ చదువుకునేందుకు ఏర్పాటు చేశారు. బంధ విముక్తురాలు కావడంతో ప్రస్తుతం ఆ బాలిక  ఆనందిస్తోంది.

మరిన్ని వార్తలు