అమెరికాలో కాల్పులు..ముగ్గురి మృతి

29 Jul, 2018 12:43 IST|Sakshi
సంఘటన జరిగిన ప్రాంతంలో పోలీసులు

న్యూ ఓర్లియాన్స్‌: అమెరికాలోని న్యూ ఓర్లియాన్స్‌ నగరంలో శనివారం రాత్రి పదిన్నర గంటల సమయంలో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ముగ్గురు వ్యక్తులు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. గాయపడిన వారిని దగ్గరలోని రెండు ఆసుపత్రులలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. న్యూఓర్లియాన్స్‌ నగరంలోని ఫ్రెంచ్‌ క్వార్టర్‌ సమీపంలో ఉన్న క్లాయ్‌బోర్న్‌అవెన్యూలో  ఈ కాల్పులు జరిగాయి.

ముసుగులు ధరించి ఉన్న ఇద్దరు వ్యక్తులు విచక్షణా రహితంగా జన సమూహంపై తుపాకులతో కాల్పులు జరిపారని స్థానిక పోలీసు అధికారి మైఖేల్‌ హారీసన్‌ తెలిపారు. కాల్పులు జరిపిన వారిని పట్టుకోవడానికి గాలింపు చర్యలు వేగవంతం చేశామని హారీసన్‌ తెలిపారు. కాల్పులకు సంబంధించి ఎవరికైనా సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని కోరారు. కాల్పుల సంఘటనను నగర మేయర్‌ లాటోయో కాంట్రెల్‌ ఖండించారు. ఇలాంటి ఘటనలకు ఓర్లియాన్స్‌లో తావులేదని ట్విటర్‌ ద్వారా తెలిపారు.

మరిన్ని వార్తలు