రోడ్డు ప్రమాదం: నవ దంపతులు దుర్మరణం

19 Jun, 2020 04:19 IST|Sakshi
ప్రమాదంలో మృతి చెందిన నవ్య, వెంకటేష్‌

కారు డ్రైవర్‌ కూడా మృతి      

ప.గో. జిల్లాలో ఘటన

ఏలూరు టౌన్‌: రోడ్డు ప్రమాదంలో నవ దంపతులు దుర్మరణం చెందిన విషాద ఘటన పశ్చిమగోదావరి జిల్లా పూళ్ల గ్రామం సమీపంలో జాతీయ రహదారిపై గురువారం జరిగింది. ప్రమాదంలో డ్రైవర్‌ కూడా మృతిచెందగా, వధువు సోదరుడు తీవ్రగాయాలతో బయటపడ్డాడు. విశాఖ జిల్లా సబ్బవరానికి చెందిన యడ్లపల్లి వెంకటేష్‌కు గుంటూరు జిల్లా తెనాలి సమీపంలోని గోవాడకు చెందిన ఆలపాటి మానస నవ్యతో ఈనెల 14న రాత్రి గోవాడలో వివాహం జరిగింది.

వివాహం అనంతరం గురువారం వధువు సోదరుడు భరత్‌తో కలిసి నవ దంపతులు సబ్బవరానికి కారులో బయలుదేరారు. పూళ్ల గ్రామం సమీపానికి వచ్చేసరికి హైవేపై కారు డివైడర్‌ను ఢీకొట్టి గాలిలో ఎగురుతూ ఆవలి వైపు పడింది. అదే సమయంలో ఏలూరు వైపు వస్తున్న లారీ వీరి కారును బలంగా ఢీకొట్టడంతో కారు నుజ్జునుజ్జయ్యింది. ఏలూరు డీఎస్పీ దిలీప్‌కిరణ్‌ ఘటనాస్థలికి చేరుకుని క్షతగాత్రులను ఏలూరులోని జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే దంపతులు, కారు డ్రైవర్‌ చంద్రశేఖర్‌ (57) మృతి చెందారు. భరత్‌ తీవ్రగాయాలతో బయటపడ్డాడు. ఘటనపై పోలీసులు విచారణ చేపట్టారు.  

మరిన్ని వార్తలు