గ్రూప్‌-2 పరీక్ష రాస్తున్నారా..

24 Feb, 2017 22:33 IST|Sakshi
గ్రూప్‌-2 పరీక్ష రాస్తున్నారా..
 - ప్రిలిమినరీ పరీక్షకు విధిగా ఫొటో గుర్తింపు కార్డు తీసుకెళ్లాలి
– జిల్లా వ్యాప్తంగా 26న 152 సెంటర్లలో  నిర్వహణ
– గంట ముందు పరీక్ష కేంద్రానికి చేరుకోవాలి
 –9.45గంటల తర్వాత అనుమతించారు
 – పరీక్ష నిర్వహణకు పకడ్బందీ చర్యలు
కర్నూలు(అగ్రికల్చర్‌): ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ గ్రూపు–2 పరీక్షకు జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. 995 పోస్టుల భర్తీకి ఏపీపీఎస్‌సీ ఈ నెల 26న ప్రిలిమినరీ పరీక్ష  నిర్వహించనుంది. ఒక పోస్టుకు 670 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జిల్లాకు సంబంధించి గ్రూపు–2 పరీక్షకు 56,188 మంది అభ్యర్థులు హాజరు కానున్నారు. పరీక్షకు జిల్లా వ్యాప్తంగా కర్నూలు, కల్లూరు, నంద్యాల, డోన్, నందికొట్కూరు, ఆళ్లగడ్డ, బనగానపల్లె, కోవెలకుంట్ల, పాణ్యం, ఆదోని, ఎమ్మిగనూరులలో  152 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.  ఈ పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా స్థాయిలో డీఆర్‌ఓ గంగాధర్‌గౌడు కో ఆర్డినేటర్‌గా, 11 మంది జిల్లా అధికారులను పర్యవేక్షకులుగా, 46 మంది తహసీల్దార్లను లైజన్‌ ఆఫీసర్లుగా, 152 మందితో కూడిన డిప్యూటీ తహసీల్దార్లు, ఆర్‌ఐ, సీనియర్‌ అసిసె​‍్టంట్లను  అసిస్టెంటు లైజన్‌ అధికారులుగా జిల్లా కలెక్టర్‌  నియమించారు. ఇక పరీక్ష కేంద్రాల ప్రిన్స్‌పాళ్లు చీఫ్‌ సూపరింటెండెంట్లుగా వ్యవహరిస్తారు. ఏపీపీఎస్‌సీ అసిస్టెంట్‌ సెక్రటరీ అలివేలుమంగమ్మ, సెక‌్షన్‌ ఆఫీసర్లు కృష్ణవేణి, వెంకటరావు, సాయిప్రకాశ్‌లు పరీక్ష కేంద్రాలను తనిఖీ చేస్తారు.  అ«భ్యర్థులు పరీక్షకు ముందురోజు తమ సెంటరును చూసుకోవాలని  ఏపీపీఎస్‌సీ అసిస్టెంట్‌ సెక్రటరీ అలివేలుమంగమ్మ సూచించారు. నివాస ప్రాంతానికి పరీక్ష కేంద్రం దూరంగా ఉంటే ఒక రోజు ముందుగా సెంటరుకు చేరుకోవడం మంచిదని తెలిపారు. మాల్‌ ప్రాక్టీస్‌కు పాల్పడితే క్రిమినల్‌ కేసులతో పాటు వెంటనే డిబార్‌ చేస్తామని తెలిపారు.
అభ్యర్థులకు ముఖ్యమైన సూచనలు 
  • అభ్యర్థులు పరీక్ష కేంద్రంలోకి వెళ్లాలంటే ఏదో ఒక ఫొటో గుర్తింపు కార్డు (ఆధార్‌ కార్డు, ఓటరు గుర్తింపు కార్డు, పాన్‌ కార్డు, డ్రైవింగ్‌ లైసెన్స్‌)ను విధిగా చూపాలి. 
  • పరీక్ష ఉదయం 10 గంటల నుంచి 12.30 వరకు జరుగుతుంది. అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి గంట ముందుగా చేరుకోవాలి. పరీక్ష కేంద్రంలోకి 9.45కు పంపుతారు. తర్వాత వచ్చిన వారిని లోపలికి అనుమంతిచరు. 
  •  హాల్‌ టికెట్‌పై ఫొటో స్పష్టంగా కనిపించకపోతే అభ్యర్థి మూడు పాస్‌ పోర్టు ఫొటోలు తీసుకువచ్చి ఇన్విజిలేటర్‌కు ఇవ్వాలి. అభ్యర్థి సొంత డిక్లరేషన్‌ ఇచ్చి పరీక్ష రాయవచ్చు.
  • పరీక్ష కేంద్రంలోకి సెల్‌ఫోన్లు, ఇతర ఎలాంటి ఎలక్ట్రానిక్‌ వస్తువులను, చివరికి పెన్సిల్‌ను కూడా అనుమతించరు. పరీక్ష సమయం పూర్తి అయ్యే వరకు బయటకు రాకూడదు. 
  •  బ్లూ, బ్లాక్‌ పెన్‌లను మాత్రమే తీసుకెళ్లాలి.
  • ఓఎంఆర్‌ షీట్‌పై జెల్‌ పెన్నులు, పెన్సిల్‌ ద్వారా బబుల్‌ చేయరాదు. అలాంటి పత్రాలను మూల్యాంకణం చేయరు. దీనిని అభ్యర్థులు పరిగణనలో ఉంచుకోవాలి. 
  • అభ్యర్థులకు ప్రశ్నాపత్రంతో పాటు ఓఎంఆర్‌ షీట్‌తో ఇస్తారు. ఓఎంఆర్‌ షీటుకు కింద కార్బన్‌ కాపీ ఉంటుంది. మొదట ఉన్న ఓఎంఆర్‌ షీట్‌ను విధిగా ఇన్విజిలేటరుకు ఇవ్వాలి. కార్బన్‌ షీట్‌ను అభ్యర్థులు ప్రశ్నాపత్రంతో పాటు తీసుకెళ్లవచ్చు. 
 
మరిన్ని వార్తలు