విజయవాడ : స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో మెట్రోరైలు ప్రాజెక్టు భూసేకరణౖపై ప్రజాభిప్రాయ సేకరణ బుధవారం చేపట్టారు. సబ్కలెక్టర్ డాక్టర్ జి. సృజన సమావేశానికి హాజరయ్యారు. ప్రాజెక్టుకు పూర్తి వ్యతిరేకమని చేతులెత్తి నిరసన తెలిపారు. పేదలు, మద్యతరగతి వర్గాల ప్రజలను రోడ్లపాలు చేయవద్దని పలువురు విలపించారు. చంద్రబాబుకు, కలెక్టర్కు శాపనార్ధాలు పెట్టారు. మెట్రోప్రాజెక్టును అలంకార్ నుంచి సాంబమూర్తి రోడ్డు మీదుగా రైవస్ కాలువ పక్కనుంచి నిర్మించాలని సూచించారు. మరి కొందరు బీఆర్టీఎస్ ప్రాజెక్టు మాదిరిగా మెట్రో రైలు ప్రాజెక్టు మూలన పడుతుందన్నారు. జనసంచారం లేని ప్రాంతంలో మెట్రోరైలు సాగదని, అనవసరంగా స్థలాలు లాక్కుని ప్రజలను ఇబ్బందులు పెట్ట వద్దన్నారు. డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ చంద్రశేఖరరాజు పాల్గొని ప్రజాభిప్రాయాలను రికార్డు చేశారు. కార్యక్రమంలో మెట్రో రైలు ప్రాజెక్టు జీఎం కామేశ్వరరావు, అర్బన్ తహసీల్దార్ ఆర్.శివరావు పాల్గొన్నారు.