డీఎడ్‌ పరీక్షలు నిర్వహించేదెన్నడో?

11 Apr, 2017 23:10 IST|Sakshi
డీఎడ్‌ పరీక్షలు నిర్వహించేదెన్నడో?
పూర్తి కావొస్తున్న రెండో సంవత్సరం 
నేటికీ విడుదల కాని తొలి ఏడాది పరీక్షల షెడ్యూల్‌
ఆందోళనలో డీఎడ్‌ విద్యార్థులు 
రాయవరం (మండపేట) : వారంతా భావి ఉపాధ్యాయులు. ఉపాధ్యాయులైన అనంతరం విద్యార్థులకు సమయానికి పరీక్షలు నిర్వహించాల్సిన బాధ్యత వారిపై ఉంది. ఉపాధ్యాయ శిక్షణ పొందుతున్న వీరే పరీక్షలు ఎప్పుడు రాయాలో తెలియని పరిస్థితి ఎదుర్కొంటున్నారు. డీఎడ్‌ మొదటి సంవత్సరం పూర్తయి రెండో సంవత్సరంలోకి ప్రవేశించినా... తొలి సంవత్సరం పరీక్షలకు ప్రభుత్వం షెడ్యూల్‌ విడుదల చేయక పోవడంతో డీఎడ్‌ విద్యార్థులు(ఛాత్రోపాధ్యాయులు) ఆందోళన చెందుతున్నారు. 
భిన్నంగా వ్యవహరిస్తున్న విద్యాశాఖ
విద్యార్థులు ఏ కోర్సు చదివినా సాధారణంగా జూన్, జూలై నెలల్లో పాఠాలు ప్రారంభించి ఏప్రిల్‌లో పరీక్షలు నిర్వహిస్తారు. ఆ తర్వాత విద్యా సంవత్సరాన్ని ముగిస్తారు. డీఎడ్‌ విద్యార్థుల విషయంలో మాత్రం విద్యాశాఖ భిన్నంగా వ్యవహరిస్తోంది. ప్రతి ఏటా అడ్మిషన్లు జూన్‌లో ప్రారంభించడం లేదు. అక్టోబరులో తరగతులు ప్రారంభించి సకాలంలో సిలబస్‌ను పూర్తి చేయలేక పోతున్నారు. రాష్ట్ర విద్యాశాకాధికారుల అలసత్వం కారణంగా విద్యార్థులకు సంవత్సరం కాలం వృథా అవుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 
ఇదీ జిల్లాలో పరిస్థితి...
రాజమహేంద్రవరం రూరల్‌ బొమ్మూరులో (డిస్ట్రిక్ట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ ట్రైనింగ్‌) కళాశాల ఉండగా జిల్లాలో 60 ప్రైవేటు కళాశాలలు ఉన్నాయి. ప్రభుత్వ డైట్‌ కళాశాలలో 100 మంది విద్యాభ్యాసం చేస్తున్నారు. ప్రైవేటు కళాశాలల్లో కొన్ని చోట్ల బ్యాచ్‌కు 100 మంది, కొన్ని కళాశాలల్లో బ్యాచ్‌కు 50 మంది చొప్పున విద్యాభ్యాసం చేస్తున్నారు. ఈ ప్రకారం జిల్లాలో సుమారుగా 3,900 మంది డీఎడ్‌ విద్యార్థులు చదువుతున్నారు. రెండేళ్ల కోర్సులో మొదటి సంవత్సరం పూర్తి చేసుకుని రెండో సంవత్సరంలో అడుగు పెట్టి 11 నెలలు కావస్తున్నా నేటికీ పరీక్షల షెడ్యూల్‌ విడుదల చేయలేదు. ప్రాక్టికల్‌ పరీక్షలు మాత్రం పూర్తి చేశారు. మొదటి సంవత్సరం పరీక్షలు ఎప్పుడు నిర్వహిస్తారో జిల్లా విద్యాశాకాధికారుల వద్ద కూడా ఎలాంటి సమాచారం లేదు.
విద్యార్థుల సమస్యలివీ..
రెండో సంవత్సరం పూర్తి కావస్తున్నా వార్షిక పరీక్షలు నిర్వహించకపోవడతో విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహిస్తే... రెండో సంవత్సర పాఠ్యాంశాలు చదవాలా..మొదటి సంవత్సరం పరీక్షలకు సిద్ధం కావాలా? అనే సందిగ్దంలో ఉన్నారు. రెండు సంవత్సరాలకు సంబంధించిన పరీక్షలు ఒకే సారి వెంట వెంటనే ఎలా రాయగలమని వారు ప్రశ్నిస్తున్నారు.
మా భవిష్యత్తుతో చెలగాటమా?
ప్రభుత్వం మా భవిష్యత్తుతో చెలగాటమాడుతోంది. పాఠ్య పుస్తకాలను సైతం సకాలంలో అందించలేదు. నేటి వర‍కూ మొదటి సంవత్సరం పరీక్షలు నిర్వహించలేదు. - షేక్‌ షమీలా బేగం, డీఎడ్‌ విద్యార్థిని, పలివెల, కొత్తపేట మండలం 
ఆశ్చర్యంగా ఉంది
అకడమిక్‌ విద్యా సంవత్సరం ప్రకారం గత ఏడాది నవంబరు నాటికే మొదటి సంవత్సరం పూర్తవుతుంది. సెకండియర్‌ డిసెంబర్‌ నుంచి ప్రారంభమైంది. అయినా నేటి వరకూ ఫస్టియర్‌ పరీక్షలకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఆశ్చర్యకరంగా ఉంది. 
- కె.చిరంజీవి, ప్రిన్సిపాల్, పలివెల కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ 
పరీక్షలు నిర్వహించాల్సి ఉంది
డైట్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించని విషయం వాస్తవమే. మొదటి సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహించకుండానే రెండో సంవత్సరం సిలబస్‌ చదువుతున్నారు. పరీక్షల షెడ్యూల్‌ విడుదల కావాల్సి ఉంది.  - అప్పారి జయప్రకాష్, డైట్‌ ప్రిన్సిపాల్, బొమ్మూరు, రాజమహేంద్రవరం రూరల్‌
షెడ్యూల్‌ విడుదల కావాలి
డీఎడ్‌ మొదటి సంవత్సరం పరీక్షల షెడ్యూల్‌ విడుదలైన వెంటనే పరీక్షల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు చేస్తాం. గత ఏడాది విద్యార్థుల వార్షిక పరీక్షల గురించి ఇప్పటి వరకూ ఉన్నతాధికారుల నుంచి ఎటువంటి షెడ్యూల్‌ రాలేదు.  - జి.నాగేశ్వరరావు, అసిస్టెంట్‌ కమిషనర్, ప్రభుత్వ పరీక్షల విభాగం, కాకినాడ
>
మరిన్ని వార్తలు