టర్కీ అధ్యక్ష ఎన్నికల్లో ఎర్డోగన్‌ గెలుపు

26 Jun, 2018 04:28 IST|Sakshi

ఇస్తాంబుల్‌: టర్కీ అధ్యక్ష ఎన్నికల్లో జస్టిస్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ పార్టీ(ఏకేపీ) అభ్యర్థి రెసెప్‌ తయ్యిప్‌ ఎర్డోగన్‌(64) మరోసారి ఘన విజయం సాధించారు. ఆదివారం జరిగిన ఓట్ల లెక్కింపులో ఎర్డోగన్‌కు 52.5 శాతం ఓట్లు రాగా, ఆయన సమీప ప్రత్యర్థి ముహర్రెమ్‌ ఇన్సేకు 30.6 శాతం ఓట్లు దక్కాయి. ఈ ఎన్నికల్లో 87 శాతం మంది ప్రజలు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారు. ఎర్డోగన్‌ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించినట్లు సుప్రీం ఎలక్షన్‌ కమిటీ ప్రకటించడంతో టర్కీ ప్రజలు వీధుల్లోకి వచ్చి సంబరాలు చేసుకున్నారు. తాజా ఎన్నికలతో ఎర్డోగన్‌ మరో ఐదేళ్ల పాటు అధ్యక్ష పదవిలో కొనసాగనున్నారు. కాగా, అధ్యక్ష ఎన్నికలతో పాటు పార్లమెంటుకు జరిగిన ఎన్నికల్లోనూ ఎర్డోగన్‌కు చెందిన ఏకేపీ పార్టీ జయకేతనం ఎగురవేసింది. 600 సీట్లున్న టర్కీ పార్లమెంటులో ఏకేపీ పార్టీ 293 స్థానాలను దక్కించుకోగా, మిత్రపక్షం ఎంహెచ్‌పీ 50 సీట్లలో విజయం సాధించింది. 

మరిన్ని వార్తలు