ఫిబ్రవరిలో ట్రంప్, కిమ్‌ భేటీ

20 Jan, 2019 04:39 IST|Sakshi

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఉత్తరకొరియా అధినేత కిమ్‌ జోంగ్‌ ఉన్‌తో  ఫిబ్రవరిలో మరోసారి సమావేశమవుతారని వైట్‌హౌస్‌ తెలిపింది. ఉత్తరకొరియా అణు నిరాయుధీకరణ, క్షిపణి అభివృద్ధి కార్యక్రమంపై ట్రంప్, కిమ్‌లు చర్చిస్తారని వెల్లడించింది. ఈ సమావేశం జరిగే వేదికను త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. గతేడాది జూన్‌ 12న సింగపూర్‌లోని ఓ హోటల్‌లో ట్రంప్, కిమ్‌ తొలిసారి భేటీ అయ్యారు. కాగా, ఉత్తరకొరియా అణ్వస్త్రాలను త్యజించేవరకూ ఆంక్షలను కొనసాగిస్తామని వైట్‌హౌస్‌ మీడియా కార్యదర్శి సారా శాండర్స్‌ తెలిపారు. మరోవైపు, అమెరికా దక్షిణ సరిహద్దులో నెలకొన్న మానవతా సంక్షోభంతో పాటు షట్‌డౌన్‌పై శనివారం మధ్యాహ్నం 3 గంటలకు (స్థానికకాలమానం) కీలక ప్రకటన చేస్తానని ట్రంప్‌ ట్విట్టర్‌లో తెలిపారు.

మరిన్ని వార్తలు