మహిళా, శిశు శరణార్థులకు కఠిన పరీక్షలు

20 Oct, 2017 11:18 IST|Sakshi

సాక్షి, వాషింగ్టన్‌ : ట్రావెల్‌ బ్యాన్‌ విషయంలో ఫెడరల్‌ కోర్టు తీర్పుతో భంగపడ్డ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ మరో నిర్ణయానికి సిద్ధమయ్యారు. శరణార్థులను విషయంలో మరిన్ని కఠిన ఆంక్షలు విధించేందుకు ప్రణాళికలు రచించారు. క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే వారిని తమ దేశంలోకి అనుమతించాలని ట్రంప్ ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రభావంతో మహిళలు, పిల్లలపైనే ఎక్కువ ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. 

శరణార్థు ముప్పు తీవ్రతను పరిగణనలోకి తీసుకుని వారి భద్రతను పలుస్థాయిలో దఫాలుగా పరిశీలించి తమ దేశంలోకి అనుమతిస్తుంది. ఈ క్రమంలో బయోగ్రఫిక్‌, బయోమెట్రిక్‌ డేటా ద్వారా శరణార్థులు డేటాను పరిశీలిస్తారు. ఇంటెలిజెన్స్‌ డేటా బేస్‌లో ఎలాంటి తప్పులు దొర్లకుండా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇంతకాలం మహిళలు, పిల్లల విషయంలో నిబంధనల సడలింపు ఉన్నప్పటికీ.. ఇకపై ఊపేక్షించాల్సిన అవసరం లేదని అధికారులకు స్పష్టమైన ఆదేశాలు అందాయంట. సెక్యూరిటీ స్కీనింగ్ విషయంలో పురుషులను మాత్రమే అన్ని విధాలుగా పరిశీలించి పంపేవారు. కొత్త నిబంధనల కారణంగా ఇకపై వారిని క్షణ్ణంగా పరిశీలించాల్సి ఉంటుంది. ఒకవేళ ఎదైనా తప్పులు దొర్లితే మాత్రం వారిని అనుమతించరన్న మాట. ఇక ఈ అంశంపై స్పందించేందుకు వైట్‌హౌజ్‌ ప్రతినిధులు నిరాకరించగా.. ఇది కేవలం 120 రోజులకు సంబంధించిన సమీక్షేనంటూ ఓ అధికారి చెబుతున్నారు. 

ఇక 2016 నుంచి మొత్తం 85,000 మంది శరణార్థులు అమెరికాలో తలదాచుకుంటుండగా.. వీరిలో 72 శాతం మహిళలు, పిల్లలే ఉన్నారు. గత ప్రభుత్వాలు పురుషులతోనే(ఉగ్రవాద సంస్థల్లో చేరే అవకాశం) ఎక్కువ ముప్పు ఉందని భావించింది. కానీ, ట్రంప్‌ ప్రభుత్వం తాజాగా తీసుకున్న నిర్ణయంతో వారికి సమస్యలు తప్పేలా కనిపించటం లేదు. ఇదిలా ఉంటే శరణార్థులను కట్టడి చేయటంలో ట్రంప్‌ సఫలం అవుతున్నాడనే చెప్పొచ్చు. గతంలో ఒబామా అధ్యక్షుడిగా ఉన్న సమయంలో ఏడాదికి 1.10,000 శరణార్థులు అమెరికాలో అడుగుపెట్టగా.. ట్రంప్‌ అధికారంలోకి వచ్చిన ఈ పది నెలల కాలంలో కేవలం 50,000 మందిని మాత్రమే అనుమతించారు. ఇక వచ్చే ఏడాదికి ఆ సంఖ్యన మరో 5 వేలకు తగ్గించాలన్నది ట్రంప్‌ ఆలోచనగా కనిపిస్తోంది.

మరిన్ని వార్తలు