-

ప్రొఫెసర్‌కు మరణశిక్ష; పాక్‌ను అభ్యర్థించిన ఐరాస

28 Dec, 2019 13:34 IST|Sakshi

సాక్షి, ఇస్లామాబాద్‌ : దైవ దూషణ ఆరోపణలపై ప్రొఫెసర్‌కు మరణ శిక్ష విధించడాన్ని ఐరాస మానవ హక్కుల కమిషన్‌ పాకిస్తాన్‌ను తప్పుపట్టింది. మరణశిక్ష విధిస్తూ దిగువ కోర్టు ఇచ్చిన తీర్పును అపహాస్యమైనదిగా పేర్కొంది. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో ప్రొఫెసర్‌ జునైద్‌ హఫీజ్‌కు హైకోర్టులో అప్పీల్‌ చేసుకునే అవకాశం ఇవ్వాలని, హైకోర్టు న్యాయమూర్తులు హఫీజ్‌ను నిర్దోషిగా ప్రకటించాలని కోరారు. అసాధారణ కేసులలో మాత్రమే మరణ శిక్ష విధించాలని, లేకపోతే తిరుగులేని సాక్ష్యం అయినా ఉండాలని ప్రకటనలో పేర్కొన్నారు. హఫీజ్‌ కేసులో ఎలాంటి ఆధారాలు లేవు కనుక శిక్షను అమలు చేయడమంటే ఈ చర్య ఏకపక్ష నిర్ణయంతో పాటు అంతర్జాతీయ చట్టానికి విరుద్దమని వారు తెలిపారు.

భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను చట్టబద్ధంగా వినియోగించే వ్యక్తులకు దైవ దూషణ చట్టాలు అడ్డంకిగా ఉన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇదిలా ఉండగా, హఫీజ్‌ను ఐరాస మత స్వేచ్ఛా కమిషన్‌ ప్రపంచ బాధితుల జాబితాలో చేర్చింది. 2013లో మహమ్మద్‌ ప్రవక్తపై ప్రొఫెసర్‌ జునైద్‌ హఫీజ్‌ అనుచిత వ్యాఖ్యలు చేశారని మిలిటెంట్‌ ఇస్లామిస్ట్‌ పార్టీకి చెందిన విద్యార్థులు ఆరోపించారు. 95 శాతం ముస్లింల జనాభా ఉన్న పాకిస్తాన్‌లో ఇస్లాంకు వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేస్తే మరణ శిక్ష విధిస్తారు. ఈ నేపథ్యంలో ఉదారవాద, లౌకిక అభిప్రాయాలు కలిగిన హఫీజ్‌ను లక్ష్యంగా చేసుకున్నారని అతని తరపు న్యాయవాది ఆరోపించారు. అంతకు ముందు 2014లో హఫీజ్‌ తరపున వాదించడానికి అంగీకరించిన న్యాయవాది రషీద్‌ రెహ్మీన్‌ను గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు. ఆ ఘటనలో ఇప్పటివరకు ఒక్కరిని కూడా నిందితులుగా పేర్కొనలేదు. చదవండిపాక్‌ : దైవదూషణ కేసులో ప్రొఫెసర్‌కు మరణశిక్ష

మరిన్ని వార్తలు