స్వచ్ఛభారత్ కు సంకల్పం

3 Oct, 2014 01:34 IST|Sakshi
స్వచ్ఛభారత్ కు సంకల్పం

* దేశంలోనే అతిపెద్ద పరిశుభ్రత కార్యక్రమాన్ని ప్రారంభించిన ప్రధాని
* ఐదేళ్లలో 2 లక్షల కోట్లతో ‘క్లీన్ ఇండియా’ లక్ష్యం
* ఇది గాంధీజీ స్వప్నం.. 125 కోట్ల భారతీయుల బాధ్యత


న్యూఢిల్లీ: ‘పరిశుభ్ర భారత్’ దిశగా దేశం తొలి అడుగు వేసింది. జాతిపిత జయంతి రోజు ఆయన స్వప్నం ‘క్లీన్ ఇండియా’కు భారత ప్రధాని నరేంద్రమోదీ శ్రీకారం చుట్టారు. స్వయంగా చీపురు పట్టి, చెత్త ఊడ్చి కార్యక్రమం పట్ల తన అంకితభావాన్ని ప్రదర్శించారు. ఐదేళ్లలో భారత్‌ను ప్రపంచంలోనే అత్యంత పరిశుభ్ర దేశాల్లో ఒకటిగా మార్చే బాధ్యత 125 కోట్ల భారతీయులందరిపై ఉందంటూ.. 2019లో మహాత్ముడి 150వ జయంతి నాటికి స్వచ్ఛమైన భారతదేశాన్ని ఆయనకు నివాళిగా అందిద్దామని ప్రజలకు పిలుపునిచ్చారు.
 
దాదాపు రూ. 2 లక్షల కోట్ల ఖర్చుతో ఎన్‌డీఏ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భారతదేశ అతిపెద్ద పారిశుద్ధ్య కార్యక్రమం ‘స్వచ్ఛ భారత్’ కార్యక్రమాన్ని ఢిల్లీలోని రాజ్‌పథ్ రోడ్‌లో గురువారం ప్రధాని నరేంద్రమోదీ ప్రారంభించారు. దేశాన్ని స్వచ్ఛంగా మారుస్తామంటూ ప్రజలతో ప్రతిజ్ఞ చేయించారు. ఒక్కరు 9 మందిని, ఆ 9 మంది ఒక్కొక్కరు మరో 9 మందిని.. ఇలా గొలుసుకట్టుతో స్వచ్ఛభారత్ మిషన్‌లో దేశ ప్రజలను భాగస్వాములు చేయాలని పిలుపునిచ్చారు. దీన్ని కేవలం ఫోటోలు దిగే కార్యక్రమంగా భావించరాదని, పరిశుభ్రత కోసం దేశప్రజలందరూ వారానికి రెండు గంటలు, సంవత్సరానికి 100 గంటలు కేటాయించాలని కోరారు.

తాను కూడా ఆ మేరకు సమయం కేటాయిస్తానన్నారు. అనంతరం మోదీ కార్యక్రమాన్ని స్ఫూర్తిగా తీసుకుని దేశవ్యాప్తంగా పలు నగరాలు, పట్టణాల్లో లక్షలాదిగా ప్రజలు స్వచ్ఛ్ భారత్ కార్యక్రమంలో పాల్గొని, తమ ఇళ్లు, కార్యాలయాల పరిసరాలను పరిశుభ్రం చేశారు. బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ కూడా పాల్గొన్న ప్రారంభోత్సవ కార్యక్రమంలో మోదీ మాట్లాడుతూ.. ‘స్వచ్ఛ భారత్’ భాధ్యత ప్రభుత్వానిదో, పారిశుద్ధ్య కార్మికులదో, స్వచ్ఛంద సంస్థలదో మాత్రమే కాదని, 125 కోట్ల మంది భారతీయులు ఇందులో భాగస్వాములని తేల్చి చెప్పారు.

‘అత్యంత చవకగా అంగారక గ్రహానికి చేరుకోగలిగిన మనం.. మన దేశాన్ని శుభ్రం చేసుకోలేమా?’ అంటూ దేశ ప్రజల్లో స్ఫూర్తిని నింపారు. ‘ఈ కార్యక్రమం రాజకీయాలకు అతీతమైంది. ఇది దేశభక్తి నుంచి స్ఫూర్తి పొందిన కార్యక్రమం’ అని స్పష్టం చేశారు. ‘రాజకీయాలపై దృష్టి పెట్టి ఈ పని చేయొద్దు. స్వచ్ఛమైన మనస్సుతో చెబుతున్నా. ఇందులో రాజకీయాలు చేరితే.. మరోసారి భరతమాత సేవలో మనం విఫలమైనట్లే’ అన్నారు. భారత్‌ను పరిశుభ్రంగా మార్చేందుకు గత ప్రభుత్వాలు కూడా కృషి చేశాయని పేర్కొన్నారు.  పలు రాజకీయ, సామాజిక, సాంస్కృతిక సంస్థలు కూడా ఈ దిశగా ప్రయత్నించాయన్నారు. ‘మహాత్మాగాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ కూడా ఈ పని చేపట్టింది. అయితే, ఇందులో ఎవరు విజయవంతమయ్యారు? ఎవరు విఫలమయ్యారన్న విషయాల్లోకి మనం వెళ్లొద్దు. మన బాధ్యత మనం సక్రమంగా నిర్వర్తిద్దాం’ అని వ్యాఖ్యానించారు.
 
గ్రామీణ మహిళల వెతలపై ఆవేదన: దేశంలోని గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా 60% ప్రజలు ఇంకా బహిరంగ ప్రదేశాల్లోనే మల విసర్జన చేస్తున్నారన్న మోదీ.. టాయిలెట్లు లేని గ్రామీణ మహిళల వెతలను తీర్చాల్సి ఉందన్నారు. సామాజిక బాధ్యతగా భావించి పాఠశాలల్లో బాలికల కోసం ప్రత్యేక టాయిలెట్ల నిర్మాణాన్ని చేపట్టాలని తాను కార్పొరేట్ సంస్థలకు విజ్ఞప్తి చేశానన్నారు. విదేశాల్లో బహిరంగ ప్రదేశాల్లో చెత్తను వేయరని, ఆ విషయంలో విదేశాల నుంచి భారత్ ఎంతో నేర్చుకోవాల్సి ఉందని మోదీ వ్యాఖ్యానించారు. ‘అలవాట్లు అంత తొందరగా మారవు. అయినా చిత్తశుద్ధితో ప్రయత్నించాలి’ అన్నారు. స్వచ్ఛ్ భారత్ కార్యక్రమాన్ని ఇంటర్నెట్లో, సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నామన్నారు. ఇందుకు ఝడ జౌఠి.జీ అనే ప్రత్యేక వెబ్‌సైట్‌ను రూపొందించామని తెలిపారు.  క్లీన్ ఇండియాకు ప్రత్యేకంగా వెబ్‌సైట్, ఫేస్‌బుక్, ట్విట్టర్ పేజీలను ప్రారంభించామన్నారు. అనారోగ్య కారణాలతో ప్రతీవ్యక్తి ఏటా రూ. 6500 ఖర్చు చేస్తున్నాడన్న ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలను ప్రస్తావిస్తూ.. పరిశుభ్ర పరిసరాలతో ప్రజలు అరోగ్యంగా ఉండి, ఆ ఖర్చును తగ్గించుకోవచ్చన్నారు.
 
లోగో రూపకర్తలకు అభినందనలు
మహాత్మాగాంధీ కళ్లద్దాలను ‘స్వచ్ఛ్ భారత్’ లోగోగా రూపొందించిన మహారాష్ట్రకు చెందిన అనంత్‌ను, ‘ఏక్ కదమ్ స్వచ్ఛతా కీ ఓర్(స్వచ్ఛత దిశగా ఒక అడుగు)’ను కార్యక్రమ నినాదంగా ఇచ్చిన గుజరాత్‌కు చెందిన భాగ్యశ్రీలను ఈ సందర్భంగా మోదీ అభినందించారు. ‘భారత్‌ను స్వచ్ఛంగా చేశామా లేదా? అని ఈ కళ్లద్దాల ద్వారా గాంధీజీ మనల్ని చూస్తున్నట్లుగా అనిపిస్తోంది’ అన్నారు.

 మోదీ ప్రసంగంలోని మరికొన్ని ముఖ్యాంశాలు..
     
ఈ రోజు గాంధీజీ, లాల్‌బహదూర్ శాస్త్రిల జయంతి. శాస్త్రి ఇచ్చిన జై జవాన్ పిలుపునకు రైతాంగం కదిలి దేశ ధాన్యాగారాలను నింపింది. గాంధీ కల ‘క్విట్ ఇండియా’, ‘క్లీన్ ఇండియా’. క్విట్ ఇండియా పిలుపుతో స్వాతంత్య్రం సాధించారు. కానీ ‘క్లీన్ ఇండియా’ కల అసంపూర్తిగానే మిగిలింది. ఆ కల నెవవేర్చడానికి ఇప్పుడు సమయం వచ్చింది.
     
ఎక్కడైనా చెత్త ఉంటే ఫోటోను, ఎత్తివేసిన తరువాత ఫోటోను అప్‌లోడ్ చేయండి. పారిశుధ్యం కోసం కృషి చేస్తున్న యువసంఘాలను వెలుగులోకి తీసుకురావాలని మీడియాను కోరుతున్నా.
 
2 లక్షల కోట్లు: రెండు స్థాయిల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. రూ. 62 వేల కోట్లతో(ఇందులో కేంద్ర వాటా రూ. 14,623 కోట్లు) దేశవ్యాప్తంగా 4041 పట్టణాల్లో.. రూ. 1.34 లక్షల కోట్లతో గ్రామాల్లో ‘స్వచ్ఛ్ భారత్’ను నిర్వహిస్తారు. గ్రామాల్లో పరిశుభ్రత కోసం ప్రారంభించిన ‘నిర్మల్ భారత్ అభియాన్’ను ఈ కార్యక్రమంలోనే విలీనం చేయాలని కేంద్ర కేబినెట్ నిర్ణయించిన విషయం తెలిసిందే.
 
స్వచ్ఛ్ భారత్‌లో ఏం చేయాలి...!
* ప్రతీఒక్కరు ‘పరిశుభ్ర భారత్’లో భాగస్వాములు కావాలి.
* అందరూ వారానికి రెండు గంటల చొప్పున సంవత్సరానికి కనీసం 100 గంటల సమయం పరిశుభ్రతకు కేటాయించాలి.
* తాము నివాసం ఉంటున్న ప్రాంతాలు, ఆ పరిసరాలు.. కార్యాలయాలు, కార్యాలయ ప్రాంగణాలను శుభ్రంగా ఉంచాలి.
* పరిసరాల్లోని మురికికాల్వలను శుభ్రం చేయాలి. బహిరంగ ప్రదేశాల్లో చెత్త వేయరాదు.
* విద్యార్థుల తమ పాఠశాలలను స్వచ్ఛంగా ఉంచుకోవాలి.
* పాఠశాలల్లో బాలికల కోసం ప్రత్యేక టాయిలెట్లను నిర్మించాలి. (ఇందుకు కార్పొరేట్ సంస్థల సాయం కోరినట్లు ప్రధాని మోదీ తెలిపారు)
* గ్రామీణప్రాంతాల్లో బహిరంగ మలవిసర్జనను నిర్మూలించాలి. వ్యక్తిగత టాయిలెట్ల నిర్మాణాన్ని ప్రోత్సహించాలి.
* గ్రామీణ మహిళల కోసం కమ్యూనిటీ టాయిలెట్లను నిర్మించాలి.
* ‘మేన్యువల్ స్కావెంజర్’ వ్యవస్థను సమూలంగా నిర్మూలించాలి.

 
గ్రామాల స్వచ్ఛతకు ఏటా 20 లక్షలు
న్యూఢిల్లీ: ‘స్వచ్ఛ భారత్’ ఉద్యమంలో భాగంగా దేశంలోని 2.47 లక్షలకుపైగా ఉన్న గ్రామాలను పరిశుభ్రంగా ఉంచేందుకు గ్రామ పంచాయతీలకు ఏటా రూ. 20 లక్షల చొప్పున నిధులు అందిస్తామని కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్యశాఖ మంత్రి నితిన్ గడ్కారీ ప్రకటించారు. గురువారం ఢిల్లీలోని తన శాఖ కార్యాలయం ఆవరణలో అధికారులతో కలిసి చీపురుపట్టిన గడ్కారీ అనంతరం మీడియాతో మాట్లాడారు. త్వరలోనే కొన్ని గ్రామాలకు ఈ నిధులను అందిస్తామన్నారు. ఈ పథకం కోసం ప్రభుత్వం ప్రకటించిన రూ. 1.96 లక్షల కోట్ల నిధి నుంచి ఈ సొమ్మును గ్రామాలకు అందిస్తామని అధికారులు చెప్పారు.
 
స్వచ్ఛ భారత్ నిధి
గ్రామాలు ప్రత్యేకించి స్కూళ్లలో పారిశుద్ధ్య సేవలకు కార్పొరేట్ కంపెనీలు, వ్యక్తుల నుంచి నిధుల సేకరణ కోసం కేంద్రం గురువారం స్వచ్ఛ భారత్ నిధిని ఏర్పాటు చేసింది.  
 
సాధించేదాకా కొనసాగిద్దాం!
సాక్షి, న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రారంభమైన ‘స్వచ్ఛభారత్’ కార్యక్రమాన్ని ఐదేళ్లపాటు కొనసాగించాలని కేంద్ర పట్టణాభివృద్ధిశాఖ మంత్రి ఎం. వెంకయ్యనాయుడు పిలుపునిచ్చారు. పనిచేసే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచి పని వాతావరణాన్ని సృష్టించాలని ఉద్యోగులకు సూచించారు. ప్రధాని మోదీ నేతృత్వంలో గురువారం జరిగిన ర్యాలీలో వెంకయ్య టీషర్టు, క్యాప్ ధరించి  విద్యార్థులతో కలిసి 4 కిలోమీటర్లు నడిచారు.

మరిన్ని వార్తలు