ఎయిర్‌పోర్ట్‌లో జలపాతం.!

28 Aug, 2018 19:13 IST|Sakshi

గువాహటి: అస్సాంలోని లోక్‌ప్రియ గోపినాథ్ బోర్డొలోయ్ అంతర్జాతీయ విమానాశ్రయం(గువాహటి ఎయిర్‌పోర్ట్‌) జలపాతాన్ని తలపించింది. సోమవారం సాయంత్రం కురిసిన వర్షానికి ఎయిర్‌పోర్ట్‌ పైకప్పు నుంచి వర్షపు నీరు ప్రయాణికుల లాంజ్‌లోకి చేరింది. ఏసీ, లైట్ల రంధ్రాల నుంచి కారుతున్న వర్షపు నీటితో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. దాదాపు గంటపాటు ఇదే పరిస్థితి నెలకొంది. వర్షపు నీరు చేరడం వల్ల లగేజ్‌ స్ర్కీనింగ్‌ మెషీన్‌లు పాడయ్యాయని  ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తెలిపారు. అంతకు మించి ఎటువంటి నష్టం వాటిల్లలేదని పేర్కొన్నారు.

ఎయిర్‌పోర్ట్‌లోకి వర్షపు నీరు చేరడం వల్ల పలువురు ప్రయాణికుల లగేజ్‌ తడిసిపోయింది. చాలామంది ప్రయాణికులు తమ లగేజ్‌ తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. గువాహటి ఎయిర్‌పోర్ట్‌ విస్తరణ పనుల్లో భాగంగా కొత్తగా నిర్మించిన ప్రయాణికుల లాంజ్‌లో ఇలాంటి పరిస్థితి చోటుచేసుకోవడంపై ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై తక్షణమే విచారణ చేపట్టాలని నెటిజన్లు పౌరవిమానాయాన శాఖ మంత్రి జశ్వంత్‌ సిన్హాతోపాటు ప్రధాని నరేంద్ర మోదీని కోరుతున్నారు.  

>
మరిన్ని వార్తలు