దిగ్గజాలు కాదు భల్లూకాలు

24 Feb, 2015 00:31 IST|Sakshi
దిగ్గజాలు కాదు భల్లూకాలు

ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు
 
 కేంద్ర మంత్రిత్వ శాఖలలో దేశీయ కార్పొరేట్ దిగ్గజాలు తిష్ట వేయడం ఈరోజు ముచ్చట  కాదు. కూపీలతో, లంచాలతో, ప్రలోభాలతో అవి పాలనా వ్యవస్థలో చొరబడుతూనే ఉన్నాయి. పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థ కొనసాగినంతకాలమూ ఇదే కొనసాగిస్తాయి కూడా. పెట్టుబడి దారీ వ్యవస్థకు సంరక్షకునిగా అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వమైనా చేయగలిగిందేమిటి! వారి రాజకీయ మనుగడ కొనసాగడానికి డబ్బు సహా, అన్ని‘రకాల’ తోడ్పాటును అందించేందుకు సదా సిద్ధంగా ఉండే బడా పెట్టుబడిదారీ వర్గాల ప్రయోజనాలను కాపాడటమే!
 
 
 ‘పరాయి పాలన తొలగి, దాని స్థానంలో స్వదేశీ ప్రభుత్వం ఏర్పడినప్పటికీ తమ ప్రత్యేక హక్కులను కోరుకునే సంపన్నవర్గాలూ, గ్రూపులూ తమ హక్కులను స్వచ్ఛందంగా వదులుకున్నట్టు చరిత్రలో ఎక్కడా దాఖలా లేదు. ఈ కొలదిమంది స్వార్థ ప్రయోజనాలను ముట్టకుండా అలాగే కొనసాగిస్తే ఇక అది దేశానికి నామమాత్రపు స్వాతంత్య్రం కూడా కాజాలదు.’
 - జవహర్‌లాల్ నెహ్రూ
 
 ‘దేశ స్వాతంత్య్రానంతర దశలో పాత సామ్రాజ్యవాద, విదేశీ పెట్టుబడి దారులతో పాటు దేశీయ పెట్టుబడిదారులు కూడా చేతులు కలిపి ఉభయ వర్గాలు ప్రజలను దోచుకుతింటాయి.’    
 - భగత్‌సింగ్
 
 ఇంతకూ ‘లోకువ ఎవ్వడురా అంటే, దారినపోయే సుంకర కొండయ్య’ అన్నాడని పెద్దలు అంటూ ఉంటారు. బొగ్గు, గని ఖనిజాలు, 2-జీ వంటి కుంభకోణాల గొడవ పాతది. వీటి గురించి సుప్రీంకోర్టు వెల్లడించి, గద్దించే వరకు వాటిపైన విచారణ జరిపి నేరగాళ్లను శిక్షించిన పాపాన పోలేదు. ఈ నిర్లిప్తత, దాటవేత ఒక్క కాంగ్రెస్-యూపీఏ గుత్త సొమ్ము కాదనీ, అది బీజేపీ-ఎన్డీఏ గుత్తసొమ్ము కూడాననీ తాజాగా నిగ్గు తేలింది. ఆ ఇద్దరిలో ఎవరికి ఎవరూ తీసిపోరని ఇంధన, పెట్రోలియం, విద్యుత్‌శాఖలలో తాజాగా జరిగిన కీలకపత్రాల తస్కరణ బాగోతం చెబుతోంది. ఆ పత్రాలను తస్క రించి లబ్ధి పొందడానికి దేశ విదేశాలకు చెందిన ఐదు బడా ప్రైవేట్ కార్పొరేట్ సంస్థలు ఎంతకు తెగించాయో ఈ ఉదంతం వెల్లడిస్తున్నది. దేశీయ ఆర్థిక వ్యవస్థను కూల్చడానికీ, మళ్లీ పాలక వ్యవస్థ అండతోనే మనుగడ సాగించడా నికీ ఆ సంస్థలు - రిలయన్స్ ఇండస్ట్రీస్, ఎస్సార్, కెయిరాన్ ఇండియా, జూబి లెంట్ ఎనర్జీ, అనిల్ ధీరూబాయ్ అంబానీ గ్రూపులు - ఎప్పుడో సిద్ధమై నాయి. కానీ ఇంత బాహాటంగా ఈ సంస్థల పేర్లు బయటపడుతున్నా, ప్రస్తు తం పాలిస్తున్న బీజేపీ-ఎన్టీఏ గానీ, ఇంతకు ముందు పాలన వెలగబెట్టిన  కాంగ్రెస్-యూపీఏ గానీ చేసినదేమిటి? ఆరోపణలు ఎదుర్కొంటున్న కార్పొ రేట్ దిగ్గజాలను అరెస్టు చేయడం కాదు, వారి కార్యాలయాలలో డాక్యుమెం ట్లను చూసే అధికారులను తీసుకొచ్చి విచారిస్తున్నారు. ఈ ‘సుంకర కొండ య్య’లను పట్టుకుని, లక్షల కోట్లకు ఏతాములెత్తిన దిగ్గజాల జోలికి వెళ్లడం లేదు. భారత రాజ్యాంగం పాలకవర్గాలకు అలాంటి ‘స్వేచ్ఛ’ను ఇవ్వలేదు.
 
 ప్రభుత్వ శాఖలలో చెదలు
 
 కేంద్ర మంత్రిత్వ శాఖలలో దేశీయ కార్పొరేట్ దిగ్గజాలు తిష్టవేయడం ఈ రోజు ముచ్చట కాదు. కుహనా పద్ధతులతో, కూపీలతో, లంచాలతో, ప్రలో భాలతో అవి పాలనావ్యవస్థలో చొరబడుతూనే ఉన్నాయి. పెట్టుబడిదారీ దోపిడీ వ్యవస్థ కొనసాగినంతకాలం రేపు కూడా ఇదే కొనసాగిస్తాయి కూడా. నిన్న, నేడు అంబానీలు, రేపు ఆదానీలు. అంతే. పెట్టుబడి దారీ వ్యవస్థకు సం రక్షకునిగా అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వమైనా చేయగలిగిందేమిటి! వారి రాజకీయ మనుగడ కొనసాగడానికి డబ్బు సహా, అన్ని‘రకాల’ తోడ్పాటును అందించేందుకు సదా సిద్ధంగా ఉండే బడా పెట్టుబడిదారీ వర్గాల ప్రయోజనా లను కాపాడడమే. నిన్న యూపీఏకు  మద్దతుగా టాటా, బిర్లా, అంబానీలు నిలిచినట్టే; నేడు అధికారం చేపట్టిన, రేపు చేపట్టబోయే పాలక వర్గాలకి సైతం అలాంటి వర్గాలే మద్దతుగా నిలబడతాయి. తమ ప్రతినిధులకే వత్తాసు పలు కుతాయి. ఇందుకు ప్రతిగా తమ వంతు సహకారాన్ని వారికి అందించడానికి పాలకవర్గాలూ సిగ్గుపడవు. రాజీవ్‌గాంధీ హయాంలో  కేబినెట్ నిర్ణయాలు, వాటి పత్రాలు, ప్రధాని కార్యాలయం నుంచి కుమార్ నారాయణ్ అనే వేగుల వాడు దొంగిలించి విదేశాలకు అమ్మేశాడు (ఇతడు జైల్లోనే చనిపోయాడు). పటిష్ట భద్రత నడుమ ఉండే ప్రధాని, సంబంధిత కార్యాలయాల నుంచే రహ స్య పత్రాలు బహిర్గతం కావడం అంటే, కార్పొరేట్ సంస్థలు ఎంతకు తెగిస్తు న్నాయో అర్థమౌతుంది. ఇంత జరుగుతున్నా, ఈ వివాదంలో అధికారులపైన విచారణ జరిపి చర్యలు తీసుకుంటామంటే దాని అర్థం - తాము కార్పొరేట్ సంస్థలపైన వేధింపు చర్యలకు దిగుతున్నామని భావించరాదని ప్రస్తుత చమురు, సహజ వాయువు ఇంధన శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హామీ ఇస్తున్నారు! ఒకటికి పదిసార్లు మంత్రి ‘భరోసా’ ఇస్తూ ఎవరి ప్రయోజనాలు ఎక్కడ కేంద్రీకరించి ఉన్నాయో చెప్పకనే చెబుతున్నారు!
 
 ఎదురు చెబితే అంతే సంగతులు?
 
 ఈ ఎత్తుగడలు, కుట్రలతోనే గతంలో కృష్ణ-గోదావరీ బేసిన్‌లో రిలయన్స్ అంబానీలు తలపెట్టిన తవ్వకాల ద్వారా లభించిన అపార చమురు, సహజ వాయువు నిధులను గుజరాత్‌కు తరలిస్తున్నందుకు, అదికూడా ఉమ్మడి రాష్ట్ర ప్రయోజనాలకు తొలి ప్రాధాన్యమివ్వకుండా తరలిస్తున్నందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ పదే పదే అభ్యంతరం తెలపాల్సివచ్చింది. ధరలను అదుపు తప్పి పెంచడాన్నీ ఆయన నిరసించి, యూపీఏ పాలకులకు ఆరు లేఖలు రాసినా ఫలితం లేకపోయింది. కారణం? అంబానీలకు నాటి పెట్రోలి యం గ్యాస్ శాఖల డెరైక్టర్ జనరల్ వి.కె. సిబాల్ నుంచి ‘వల్లమాలిన’ ప్రేమా నురాగాలు లభించాయి! కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ నివేదిక కూడా రిలయన్స్ చర్యలను ఖండించినా సిబాల్ అండదండలతో, సంబంధిత మం త్రి దేవ్‌రా సహకారంతో ఆంధ్రప్రదేశ్ ఆయిల్ నిక్షేపాలను రిలయన్స్ యథే చ్ఛగా దోచి, గుజరాత్‌కు తరలిస్తూ వచ్చింది. అంబానీల అశీస్సులతో సిబా ల్‌కు ముంబైలో ఖరీదైన మేడ అమరింది! సీబీఐ దర్యాప్తులో ఇదీ వెల్లడైంది! అప్పటికి అయిదేళ్లుగా ప్రభుత్వం అండతోనే కేజీ బేసిన్‌లో రిలయన్స్ దోపిడీ  ఎలా సాగుతూవస్తోందో మొదటిసారిగా రాజ్యసభ సుప్రసిద్ధ సభ్యుడు తపన్ సేన్ వెల్లడించారు. ఈ క్రమంలోనే హెలికాప్టర్ అనుమానిత ప్రమాదంలో వైఎస్ చనిపోయారు! అలాగే కేజీ బేసిన్‌లో రిలయన్స్, కెయిరాన్ సాగిస్తున్న ఆయిల్, గ్యాస్ దోపిడీని, దేశ సహజవనరుల దోపిడీని అరికట్టేందుకు విశాఖ పట్నానికి చెందిన ‘విశాఖ (వార్) వెటరన్స్’ కన్వీనర్, ఇండో-పాక్ యుద్ధ వీరుడు కెప్టెన్ రాయ్ లారెన్ డేవిడ్ నాథనీల్ 2012లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు లో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) నడపాల్సి వచ్చిందని మరవరాదు.
 
 దోపిడీకి పోటీ పడుతున్న దిగ్గజాలు
 
 ప్రస్తుతం ఈ దేశీ, విదేశీ కంపెనీలు ఆయిల్, గ్యాస్ వనరుల వెలికితీత చాటు న విదేశీ ప్రత్యక్ష గుత్త పెట్టుబడులను ఆయిల్ రంగంలో 100 శాతం గుప్పిం చబోవడంతో, రక్షణ రంగంలో సహితం విదేశీ గుత్త సంస్థల పెట్టుబడులను భారీగా మోదీ ప్రభుత్వం అనుమతించబోవడంతో - ఒక కొత్త పోటీ ఈసారి అంబానీలకూ, గౌతమ్ ఆదానీ గ్రూపునకూ మధ్య పెరగనుంది. ఈ పోటీలో మోదీకి సన్నిహితులు, పెట్టుబడికి, కట్టుకథలకు మోసులెత్తిన అంబానీ, ఆదానీల మధ్య వ్యాపార వైరుధ్యం పెరగనుంది. ఆ క్రమంలోనే టాటా గ్రూపు, అంబానీలతో పాటు సన్నిహితుడైన గౌతమ్ ఆదానీ మరింతగా స్వైర విహారం చేసే అవకాశం ఉంది. ఎందుకంటే ఇప్పటి కార్పొరేట్ సంస్థలు గతంలో లాగా ‘మందకొడి’గా లేవు! వాటి చైతన్యం వ్యాపార సరిహద్దులు దాటి ప్రసార, ప్రచార మాధ్యమాల (మీడియా)కు పాకింది. సాధారణ మీడియాలో కార్పొరేట్ సంస్థల ప్రజావ్యతిరేక, రాజ్యాంగ వ్యతిరేక చర్యలు బహిర్గతం అవుతూండటంతో అవి భారీ ఎత్తున సొంత మీడియా విస్తరణకు దిగాయి.
 
 ఇప్పటికీ ఆదానీ, మోదీలు అనుమానాస్పద ఒప్పందాలలో ఉన్నా రని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పదే పదే ఆరోపిస్తున్నాడు. ఈ విషయాన్ని వినోద్ మెహతా తన తాజా గ్రంథం ‘‘ఎడిటర్ అన్‌ప్లగ్డ్’’ (పేజీ:59)లో నమోదు చేశాడు! ఇప్పుడు అంబానీ, ఆదానీలు ఇద్దరూ మీడియా ‘భల్లూకాలు’గా మారారు.  ఎన్‌డీ టీవీకి యజమానులుగా ఉన్న ప్రణయ్ రాయ్, రాధికా రాయ్‌లను తప్పించి ఆదానీ అధినేత అయ్యాడు. ఇక మన రాష్ట్రంలో ఒక గ్రూపు కంపెనీలలో తన వాటాలను ముఖేష్ అంబానీ రిలయన్స్ (రిల్)  సీఎన్‌ఎన్ చానల్‌కు చెందిన రాఘవ బాహాల్ గ్రూపునకు అమ్మేసి, వారి ఆధ్వర్యంలోని ‘టీవీ-18’ను స్వాధీనం చేసుకున్నాడు! మరో పారిశ్రామికవేత్త, బ్యాంకర్ ఉదయ్ కోటక్ ‘బిజినెస్ స్టాండర్డ్’ యజమాన య్యాడు! విద్యుత్, బొగ్గు వనరుల రంగంపై కన్నువేసిన విజయ దార్దా ‘లోక్ మత్ టీవీ’కీ, పత్రికలకూ అధిపతి! సిమెంటు, కారు బ్యాటరీల వ్యాపారి రం జిత్ రహేజా ‘అవుట్‌లుక్’ గ్రూపు సారథి! మీడియా నిర్వహణలో భావ ప్రక టనా స్వేచ్ఛను గ్యారంటీ చేసిన అమెరికన్ రాజ్యాంగం తొలి సవరణ (ఫస్ట్ ఎమెండ్‌మెంట్) చాటున దాగి ఆరు బడా బడా కార్పొరేట్ సంస్థలు- జనరల్ ఎలెక్ట్రిక్, డిస్నీ, మైహోమ్ టైమ్ వార్నర్, న్యూస్ కార్పొరేషన్, సీబీఎస్ నేడు అమెరికా మీడియాలో 90 శాతానికి రాక్షసాధిపతులు! ఆ పడమటి గాలులు తూర్పుగాలులను వేగాతివేగంగా ప్రభావితం చేస్తున్నాయి! ఇంత బరితెగిం చిన సందడిలో కూడా ప్రధాని మోదీ మాత్రం ‘నాకు పిల్లా జెల్లా ఎలాగూ లేరు, నాకెందుకు సంపాదన’ అంటూనే 120 కోట్ల మంది భారతీయుల మూ ల్గులను తినేస్తున్న మహా కోటీశ్వరులను ఆశీర్వదించడం కళాత్మక విశేషం!
 (వ్యాసకర్త మొబైల్: 9848318414)

 


 

మరిన్ని వార్తలు