సాక్షి, హైదరాబాద్: కొత్త సీజన్లో తొలి పోరుకు హైదరాబాద్ సీనియర్ క్రికెట్ జట్టు సిద్ధమైంది. ఈ నెల 15 నుంచి చెన్నైలో జరిగే ఆలిండియా బుచ్చిబాబు ఇన్విటేషన్ టోర్నమెంట్లో హైదరాబాద్ జట్టు పాల్గొననుంది.
దేశవాళీ క్యాలెండర్లో ఈ టోర్నీకి గుర్తింపు లేకపోయినా రంజీ ట్రోఫీ సీజన్కు ముందు ఆటగాళ్ళ ప్రాక్టీస్, అనంతరం జట్టు ఎంపిక కోసం ఇది సన్నాహకంగా ఉపయోగపడుతుంది. ఇందులో పాల్గొనే హైదరాబాద్ జట్టును ఆదివారం హెచ్సీఏ సెలక్టర్లు ఎంపిక చేశారు. అక్షత్ రెడ్డి మరో సారి కెప్టెన్గా జట్టును నడిపించనున్నాడు. తన్మయ్ అగర్వాల్, రోషన్ రఘురామ్, రోహిత్ రాయుడులు సీనియర్ జట్టులోకి ఎంపికవడం ఇదే తొలిసారి.
జట్టు వివరాలు: అక్షత్ రెడ్డి (కెప్టెన్), బి. సందీప్, హనుమ విహారి, తన్మయ్ అగర్వాల్, పార్థ్ జాలా, ఆకాశ్ భండారి, రోహిత్ రాయుడు, కె. సుమంత్, సీవీ మిలింద్, అమోల్ షిండే, అన్వర్ ఖాన్, మెహదీ హసన్, రవి కిరణ్, రోషన్ రఘురామ్, హబీబ్ అహ్మద్. కోచ్: అబ్దుల్ అజీమ్, మేనేజర్: శాస్త్రి (సెంట్రల్ బ్యాంక్).