సర్ఫరాజ్‌ను తీసేయండి.. నన్ను కొనసాగించండి!

5 Aug, 2019 13:09 IST|Sakshi

కరాచీ: ఇటీవల ముగిసిన వన్డే వరల్డ్‌కప్‌లో పాకిస్తాన్‌ నాకౌట్‌ దశకు చేరకపోవడంతో ఆ దేశ క్రికెట్‌ బోర్డు(పీసీబీ) ప్రక్షాళన చేపట్టింది.  ప్రధానంగా కోచ్‌, కెప్టెన్‌లను మార్చాలనే యోచనలో ఉంది. ఆ దేశ ప్రధాని ఇమ్రాన్‌ ఖాన్‌ కూడా పాక్‌ క్రికెట్‌ ఆట తీరుపై గుర్రుగా ఉన్నారు. ఇక నుంచి పాక్‌ క్రికెట్‌ను తీర్చిదిద్దే బాధ్యత తానే తీసుకుంటానని హామి ఇచ్చారు కూడా. అయితే పాకిస్తాన్‌ క్రికెట్‌కు ప్రధాన కోచ్‌ మికీ ఆర్థర్‌ సమర్పించిన నివేదికలో కెప్టెన్‌ సర్ఫరాజ్‌ అహ్మద్‌నే టార్గెట్‌ చేశారంట. అసలు కెప్టెన్‌గా సర్ఫరాజ్‌ వద్దంటూ బోర్డుకు తేల్చిచెప్పారు పీసీబీలో విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసింది. దీనిలో భాగంగా సర్పరాజ్‌ అహ్మద్‌లో పలు నెగిటివ్‌ విషయాల్ని ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఇక తాను కోచ్‌గా ఉండేందుకు మరో రెండేళ్లు పొడిగించాలని ఆర్థర్‌ కోరినట్లు సమాచారం.

తన పర్యవేక్షణలో పాక్‌ క్రికెట్‌ జట్టు ఆశించిన స్థాయిలోనే ఫలితాలు సాధించిందని స్పష్టం చేశారట. తన కోచ్‌ పదవిపై పీసీబీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ వసీం ఖాన్‌ నుంచి హామీ లభించిందని ఆర్థర్‌ ధైర్యంగా ఉన్నాడట. అయితే అదే సమయంలో శ్రీలంక ప్రధాన కోచ్‌గా సేవలందించేందుకు కూడా ఆర్థర్‌ దరఖాస్తు చేసుకున్నాడనే వార్తలు వస్తున్నాయి.  2016లో పాకిస్తాన్‌ కోచ్‌గా ఆర్థర్‌ స్వీకరించాడు. అతని పర్యవేక్షణలో పాకిస్తాన్‌ జట్టు చాంపియన్‌ ట్రోఫీని కైవసం చేసుకుంది. ఆ తర్వాత అతని హయాంలో భారీ ఘనతలు ఏమీ లేకపోకపోయినప్పటికీ, టీ20ల్లో పాక్‌ను నంబర్‌ వన్‌ స్థానంలో నిలిపాడు. ఇక టెస్టు, వన్డే ఫార్మాట్‌లో మాత్రం పాక్‌ క్రికెట్‌ జట్టు ఆశించిన స్థాయిలో ఫలితాలు సాధించకపోవడం ఆర్థర్‌ను కోచ్‌గా కొనసాగిస్తారా.. లేదా అనేది సందిగ్థంలో ఉంది. కోచ్‌గా ఆర్థర్‌ను కొనసాగించేందుకు కొంతమంది పాక్‌ మాజీలు మద్దతు తెలుపుతుండగా, మరికొంతమంది మాత్రం అతను వద్దనే అంటున్నారు. (ఇక్కడచ చదవండి: చాలా నష్టం చేశాడు.. ఇంకా కోచ్‌గా ఎందుకు?)

మరిన్ని వార్తలు