నంబర్‌వన్ భారత్

2 Sep, 2014 00:41 IST|Sakshi

వన్డే ర్యాంకింగ్స్‌లో మళ్లీ అగ్రస్థానం
 దుబాయ్: అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) వన్డే ర్యాంకింగ్స్‌లో భారత జట్టు మరో సారి ఒంటరిగా అగ్రస్థానానికి దూసుకొచ్చింది. తాజా ర్యాంకింగ్స్‌లో భారత్ 114 రేటింగ్ పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. ఇంగ్లండ్‌తో మూడో వన్డే నెగ్గిన తర్వాత భారత్, ఆస్ట్రేలియాతో సంయుక్తంగా నంబర్‌వన్‌గా ఉంది. అయితే జింబాబ్వే చేతిలో ఆసీస్ చిత్తవడంతో ధోని సేన ఒక్కటే అగ్రస్థానాన్ని పటిష్ట పరచుకుంది. తాజా ఓటమితో ఆస్ట్రేలియా (111 పాయింట్లు) నాలుగో స్థానానికి పడిపోయింది.

దక్షిణాఫ్రికా (113), శ్రీలంక (111) రెండు, మూడు స్థానాల్లో నిలిచాయి. ఈ వారంలో మరో ఐదు వన్డేలు జరగాల్సి ఉన్నందున ఈ ర్యాంకులు వెంటనే మారే అవకాశం ఉంది. టీమిండియా నంబర్‌వన్‌గా కొనసాగాలంటే ఇంగ్లండ్‌తో మిగిలిన రెండు వన్డేలు కూడా గెలవడంతో పాటు దక్షిణాఫ్రికాను ఆస్ట్రేలియా కనీసం ఒక మ్యాచ్‌లో ఓడించాలి.
 

మరిన్ని వార్తలు