సచిన్‌, ద్రవిడ్‌ల తర్వాత ముష్ఫికర్‌..

16 Nov, 2019 12:44 IST|Sakshi

ఇండోర్‌: బంగ్లాదేశ్‌ క్రికెటర్‌ ముష్ఫికర్‌ రహీమ్‌ అరుదైన ఘనతను సాధించాడు. టెస్టు ఫార్మాట్‌లో భారత్‌పై అత్యధిక పరుగులు సాధించిన బంగ్లా ఆటగాడిగా నిలిచాడు. భారత్‌తో తాజా టెస్టులో భాగంగా ముష్పికర్‌ ఈ ఫీట్‌ను నమోదు చేశాడు. బంగ్లాదేశ్‌ పీకల్లోతు కష్టాల్లో పడ్డ సమయంలో ఐదో స్థానంలో  బ్యాటింగ్‌కు దిగిన ముష్పికర్‌ ఆచితూచి ఆడుతున్నాడు. బంగ్లాదేశ్‌ ఇన్నింగ్స్‌ను సాధ్యమైనంతవరకూ చక్కదిద్దే పనిలో  పడ్డాడు. ఈ క్రమంలోనే టెస్టుల్లో భారత్‌పై బంగ్లాదేశ్‌ తరఫున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా గుర్తింపు సాధించాడు.  దీనిలో భాగంగా మహ్మద్‌ అష్రాఫుల్‌ పేరిట ఉన్న రికార్డును ముష్పికర్‌ బ్రేక్‌ చేశాడు. అంతకుముందు అష్రాఫుల్‌ భారత్‌పై 386 టెస్టు పరుగులు చేయగా, దాన్ని ముష్ఫికర్‌ బద్ధలు కొట్టాడు.(ఇక్కడ చదవండి: బంగ్లా ఓపెనర్లు.. 6,6,6,6..!)

ఇక భారత్‌-బంగ్లాదేశ్‌ల ఓవరాల్‌ టెస్టుల్లో ఇరు దేశాల ఆటగాళ్లు పరంగా అత్యధిక పరుగులు సాధించిన జాబితాను పరిశీలిస్తే ముష్ఫికర్‌ మూడో స్థానంలో ఉన్నాడు. ఈ వరుసలో తొలి స్థానంలో సచిన్‌ టెండూల్కర్‌(820), రాహుల్‌ ద్రవిడ్‌(560)లు తొలి రెండు స్థానాల్లో ఉన్నారు. ఆ తర్వాత స్థానాన్ని ముష్పికర్‌ ఆక్రమించాడు. టెస్టుల్లో భారత్‌పై 55పైగా సగటుతో ఉన్నాడు. భారత్‌తో ఐదు టెస్టు మ్యాచ్‌లు ఆడిన ముష్పికర్‌.. తొమ్మిది ఇన్నింగ్స్‌ల్లో రెండు శతకాలు సాధించాడు. ప్రస్తుతం జరుగుతున్న టెస్టు మ్యాచ్‌లో బంగ్లాదేశ్‌ తన రెండో ఇన్నింగ్స్‌లో 72 పరుగులకే ఐదు వికెట్లు కోల్పోయింది.ఐదో వికెట్‌గా మహ్మదుల్లా(15) ఔటయ్యాడు. మహ్మద్‌ షమీ బౌలింగ్‌లో రోహిత్‌కు క్యాచ్‌ ఇచ్చి మహ్మదుల్లా పెవిలియన్‌ చేరాడు. బంగ్లాదేశ్‌ కోల్పోయిన ఐదు వికెట్లలో మూడు వికెట్లు షమీ సాధించగా, ఇషాంత్‌, ఉమేశ్‌లకు తలో వికెట్‌ లభించింది.

>
మరిన్ని వార్తలు