న్యూఢిల్లీ : ‘గాయాలు అనేవి క్రీడల్లో సహజం. కానీ ఎంత త్వరగా కోలుకొని పునరగామనం చేసామనేది ముఖ్యం. ప్రస్తుతం నా లక్ష్యం తగిలిన ఎదురుదెబ్బ కన్నా నా పునరాగమనం త్వరగా, బలంగా ఉండాలని కోరుకుంటున్నాను. గాయం నుంచి త్వరగా కోలుకోవాలని విషెస్ చెప్పిన వారికి ధన్యవాదాలు. మీ ప్రేమాభిమానాలు నన్ను రెట్టింపు ఉత్సాహాన్ని కలిగిస్తున్నాయి. త్వరగానే మైదానంలోకి అడుగుపెడతా’ అంటూ టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా పేర్కొన్నాడు. గాయం కారణంగా దక్షిణాఫ్రికా టెస్టు సిరీస్కు బుమ్రా దూరమైన విషయం తెలిసిందే. బుమ్రా స్థానంలో ఉమేశ్ యాదవ్ను సెలక్టర్లు ఎంపిక చేశారు.
దీంతో ‘స్వదేశంలో తొలిసారి టెస్టు’ ఆడాలన్న బుమ్రా కల నెరవేర్చుకోవడానికి మరికొంత కాలం ఆగాల్సింది. గతేడాది జనవరిలో దక్షిణాఫ్రికాపై అరంగేట్రం నుంచి ఇప్పటివరకు ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, వెస్టిండీస్లలో 12 టెస్టులాడిన ఈ పేసర్... అదే దక్షిణాఫ్రికాపై భారత్లో మొదటిసారి సుదీర్ఘ ఫార్మాట్ బరిలో దిగేందుకు సిద్ధమవుతున్న సమయంలో అనూహ్యంగా వెన్ను గాయానికి గురయ్యాడు. వెన్నెముకలో స్వల్ప పగులు (స్ట్రెస్ ఫ్రాక్చర్)తో ఇబ్బంది పడుతున్న అతడిని సఫారీ సిరీస్ నుంచి బీసీసీఐ తప్పించింది.