అంతా ధోని మయం

25 Oct, 2016 23:10 IST|Sakshi
అంతా ధోని మయం

కెప్టెన్ నామస్మరణతో రాంచీలో హోరు
నేడు న్యూజిలాండ్‌తో నాలుగో వన్డే
గెలిస్తే సిరీస్ భారత్ వశం


పక్క ఫొటోను చూశారా..? న్యూజిలాండ్ జట్టు బస్సులో హోటల్‌కు వెళుతోంది. ఇంతలో ఓ హమ్మర్ కారు వేగంగా దూసుకువచ్చి బస్‌ను ఓవర్‌టేక్ చేసింది. కివీస్ క్రికెటర్లంతా కారులోకి చూశారు. మహేంద్ర సింగ్ ధోని... తన సొంత నగరంలో తనకు ఇష్టమైన కారుతో దూసుకువెళుతున్నాడు. అంతే రాస్ టేలర్ సహా న్యూజిలాండ్ క్రికెటర్లంతా అబ్బురంగా చూస్తూ ఉండిపోయారు.

 
రాంచీలో భారత జట్టు క్రికెట్ ఆడటం కొత్త కాదు... ధోని ఆటను ప్రత్యక్షంగా చూడటం అక్కడి అభిమానులకు కొత్త కాదు... కానీ ఎందుకో గతంతో పోలిస్తే ఈసారి నగరం అంతా ధోని నామస్మరణతో హోరెత్తుతోంది. ఇటీవల విడుదలైన ధోని సినిమా దీనికి ఓ కారణం కావచ్చు. అరుుతే అసలు కారణం మాత్రం... భవిష్యత్‌లో ధోని మళ్లీ రాంచీలో భారత్ తరఫున మరో మ్యాచ్ ఆడొచ్చు, ఆడకపోవచ్చనే సందేహం. అందుకే తన ప్రాక్టీస్‌ను చూడటానికి కూడా అభిమానులు భారీ సంఖ్యలో స్టేడియానికి వచ్చారు. ఇదీ న్యూజిలాండ్‌తో నాలుగో వన్డేకు ముందు రాంచీలో పరిస్థితి. 


రాంచీ: టెస్టుల నుంచి ధోని ఇప్పటికే రిటైర్ అయ్యాడు. వన్డేల్లో ఎంతకాలం కొనసాగుతాడో తెలియదు. దాదాపు రెండేళ్లపాటు రాంచీలో భారత్‌కు మరో వన్డే ఉండకపోవచ్చు... గతంలో ఈ వేదికలో ధోని అత్యధిక స్కోరు కేవలం 10 పరుగులు. కానీ తాజాగా మొహాలీ వన్డేలో తన ఆటతీరు చూస్తే అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు... కాబట్టి రాంచీలో కూడా అదే తరహా ఇన్నింగ్‌‌స ఆడతాడేమో. తమ నగర ముద్దుబిడ్డ ఆటను ఈసారి ఎలాగైనా ప్రత్యక్షంగా చూడాల్సిందే.... ఇదీ ఇప్పుడు రాంచీలోని సగటు క్రికెట్ అభిమాని ఆలోచన. ఏమైనా సిరీస్‌లో ఏ వన్డేకూ లేనంతగా ఆసక్తి పెరిగిపోరుుంది. ఈ నేపథ్యంలో భారత జట్టు బుధవారం జరిగే వన్డేలో న్యూజిలాండ్‌తో తలపడుతుంది. ఐదు వన్డేల సిరీస్‌లో భారత్ ప్రస్తుతం 2-1తో ఆధిక్యంలో ఉంది. నేడు జరిగే నాలుగో వన్డేలో గెలిస్తే మరో మ్యాచ్ మిగిలుండగానే సిరీస్ గెలవచ్చు. ఇక్కడే సిరీస్ గెలిస్తే వైజాగ్‌లో జరిగే ఆఖరి వన్డేలో మరికొంత మంది బెంచ్ మీద ఉన్న వాళ్లకు అవకాశం ఇవ్వొచ్చు. ఇదీ భారత్ ఆలోచన. మరోవైపు న్యూజిలాండ్‌కు సిరీస్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఇందులో కచ్చితంగా గెలవాలి. ఇక చావో రేవో తేల్చుకోవాల్సిన పరిస్థితి.

 
మార్పులు ఉండకపోవచ్చు
ధోని కొత్త క్రికెటర్లకు అవకాశం ఇవ్వడంలో ముందు ఉంటాడు. అరుుతే మ్యాచ్ ఫలితాన్ని కూడా అంతే సీరియస్‌గా తీసుకుంటాడు. కాబట్టి సిరీస్ గెలవడానికి ప్రాధాన్యత ఇచ్చి గత మూడు మ్యాచ్‌లు ఆడిన జట్టునే ఈ మ్యాచ్‌లోనూ కొనసాగించే అవకాశం ఉంది. ఓపెనర్లు రోహిత్, రహానే ఇప్పటివరకూ తమ స్థారుుకి తగ్గట్లుగా ఆడకపోవడం మినహా భారత్‌కు బ్యాటింగ్ విభాగంలో పెద్దగా సమస్యలు లేవు. ఇక బౌలింగ్‌లోనూ అంతా కుదురుకున్నట్లే కనిపిస్తోంది. ఇక్కడి పిచ్ నుంచి స్పిన్నర్లకు సహకారం లభిస్తుందనే అంచనా నేపథ్యంలో మిశ్రా, అక్షర్ పటేల్ మరోసారి కీలకం కానున్నాడు. పార్ట్‌టైమ్ స్పిన్నర్ కేదార్ జాదవ్ ఈ మ్యాచ్‌లోనూ మ్యాజిక్ చేస్తే భారత్‌కు అసలు సమస్యలే ఉండవు.

 
నిలకడలేమి సమస్య
ఇక న్యూజిలాండ్ జట్టులో సీనియర్ గప్టిల్ ఇప్పటివరకూ ఒక్క మ్యాచ్‌లోనూ సరిగా ఆడలేదు. మరో సీనియర్ రాస్ టేలర్ కూడా గత వన్డే మినహా సిరీస్ అంతా విఫలమయ్యాడు. విలియమ్సన్, లాథమ్‌ల ఫామ్ వల్ల కివీస్ సిరీస్‌లో ఎంతో కొంత ఫర్వాలేదనిపించింది. మిడిలార్డర్ వైఫల్యం జట్టుకు పెద్ద సమస్యగా కనిపిస్తోంది. కోరీ అండర్సన్ కూడా వరుసగా విఫలమవుతున్నాడు. ఇక బౌలింగ్ విభాగంలో పిచ్ పేస్‌కు అనుకూలిస్తే సౌతీ, బౌల్ట్ మ్యాజిక్ చేస్తారు. అరుుతే పిచ్ స్వభావం దృష్ట్యా సాన్‌ట్నర్‌తో పాటు మరో స్పిన్నర్ తుది జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఫామ్ సంగతి ఎలా ఉన్నా ఈ జట్టును తక్కువ అంచనా వేయకూడదని ఢిల్లీలో జరిగిన రెండో వన్డేలో తేలింది. అరుుతే సిరీస్ రేసులో నిలవాలంటే కచ్చితంగా జట్టులో ఆటగాళ్లంతా నిలకడగా ఆడాలి.

 

 జట్లు (అంచనా)
భారత్: ధోని (కెప్టెన్), రోహిత్, రహానే, కోహ్లి, మనీశ్, జాదవ్, పాండ్యా, అక్షర్ పటేల్, అమిత్ మిశ్రా, ఉమేశ్ యాదవ్, బుమ్రా.


న్యూజిలాండ్: విలియమ్సన్ (కెప్టెన్), గప్టిల్, లాథమ్, టేలర్, రోంచీ, అండర్సన్, నీషమ్, సాన్‌ట్నర్, సౌతీ, బౌల్ట్, హెన్రీ/సోధి.

 
పిచ్, వాతావరణం
వర్ష సూచన లేదు. సాయంత్రం మంచు కురుస్తుంది కాబట్టి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకునే అవకాశం ఉంది. పిచ్ నుంచి స్పిన్నర్లకు సహకారం లభించవచ్చు.

 

 మ. గం. 1.30 నుంచి  స్టార్‌స్పోర్‌‌ట్స-1లో ప్రత్యక్ష ప్రసారం

 ► 2 రాంచీలో భారత్ మూడు వన్డేలు ఆడితే రెండు గెలిచింది. ఒకటి వర్షం కారణంగా రద్దరుుంది.

 

మరిన్ని వార్తలు