గురుసాయి, సాయిప్రణీత్ ముందంజ

13 Dec, 2013 00:11 IST|Sakshi

ముంబై: ఆంధ్రప్రదేశ్ ఆటగాళ్లు గురుసాయిదత్, సాయిప్రణీత్‌లు టాటా ఓపెన్ అంతర్జాతీయ బ్యాడ్మింటన్ టోర్నమెంట్‌లో ముందంజ వేశారు. గురువారం ఇక్కడ జరిగిన తొలి రౌండ్ పురుషుల సింగిల్స్ విభాగంలో టాప్ సీడ్‌గా బరిలోకి దిగిన గురుసాయిదత్ 21-16, 21-7తో భారత్‌కే చెందిన ఆస్కార్ బన్సాల్‌పై అలవోక విజయం సాధించాడు.
 
  ప్రపంచ 22వ ర్యాంకర్ సాయిదత్ వరుస గేముల్లో అరగంటలోనే ప్రత్యర్థిని ఇంటిదారి పట్టించాడు. మరో మ్యాచ్‌లో రెండో సీడ్ సాయిప్రణీత్ 21-10, 21-10తో భారత సహచరుడు మయాంక్ బెహల్‌ను కంగుతినిపించాడు. శుక్రవారం జరిగే రెండో రౌండ్లో సాయిదత్... మోహిత్ కామత్‌తో తలపడతాడు. ఏపీ సీనియర్ ఆటగాడు చేతన్ ఆనంద్ కూడా రెండో రౌండ్లోకి ప్రవేశించాడు. తొలి రౌండ్లో అతను 21-18, 21-17తో కేతన్ చాహల్‌పై నెగ్గాడు.
 
  రోహిత్ యాదవ్ 21-16, 15-21 20-22తో యి సియాంగ్ యంగ్ (చైనీస్ తైపీ) చేతిలో, వినయ్ కుమార్ రెడ్డి 17-21, 12-21తో నాలుగో సీడ్ సౌరభ్ వర్మ చేతిలో పరాజయం చవిచూశారు. మూడో సీడ్ ప్రణయ్ 21-12, 21-12తో నిగెల్ డి సాపై, 8వ సీడ్ అనూప్ శ్రీధర్ 21-12, 21-5తో ఇండోనేసియాకు చెందిన నటాలీ ఎర్నెస్తాన్ సులిత్సోపై గెలుపొందారు. మహిళల సింగిల్స్‌లో తృప్తి ముర్గుండే 21-9, 21-17తో సంస్కృతి ఛాబ్రాపై, సయాలీ గోఖలే 21-5, 21-10తో సిరి చందనపై, లేఖ హందుంకుట్టిహెటిజ్ (శ్రీలంక) 21-11, 21-17తో విశాలాక్షిపై విజయం సాధించారు.
 

మరిన్ని వార్తలు