మెయిన్ ‘డ్రా’కు గురుసాయిదత్, సాయిప్రణీత్

8 Apr, 2015 01:55 IST|Sakshi

సింగపూర్ ఓపెన్ టోర్నీ
 
సింగపూర్ : అంచనాలకు అనుగుణంగా రాణించిన భారత బ్యాడ్మింటన్ యువతారలు గురుసాయిదత్, సాయిప్రణీత్ సింగపూర్ ఓపెన్ సూపర్ సిరీస్ టోర్నమెంట్‌లో మెయిన్ ‘డ్రా’కు అర్హత సాధించారు. మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ క్వాలిఫయింగ్ పోటీల్లో గురుసాయిదత్ తొలిరౌండ్‌లో 18-21, 21- 18, 21-18తో బూన్‌సక్ పొన్సానా (థాయ్‌లాండ్)పై నెగ్గి... రెండో రౌండ్‌లో 21-9, 21-13తో జూ వీ వాంగ్ (చైనీస్ తైపీ)ను ఓ డించాడు. మరోవైపు సాయిప్రణీత్ తొలి రౌండ్‌లో 18-21, 21-18, 21-12తో రాస్ముస్ ఫ్లాడ్‌బెర్గ్ (డెన్మార్క్)పై గెలుపొంది... జుల్ఫాది జుల్కిఫ్లి (మలేసియా)తో రెండో రౌండ్‌లో 11-6 తో ఆధిక్యంలో ఉన్నపుడు అతని ప్రత్యర్థి గాయంతో వైదొలిగాడు. భారత్‌కే చెందిన అజయ్ జయరామ్ మాత్రం మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందలేకపోయాడు.

మిక్స్‌డ్ డబుల్స్ విభాగంలో హైదరాబాద్‌కే చెందిన సిక్కి రెడ్డి-కోనా తరుణ్ ద్వయం కూడా మెయిన్ ‘డ్రా’కు అర్హత పొందింది. క్వాలిఫయింగ్ తొలి రౌండ్‌లో సిక్కి-తరుణ్ జంట 21-11, 21-12తో జియాన్ లియాంగ్ లీ-జియా యింగ్ వోంగ్ (సింగపూర్) ద్వయంపై, రెండో రౌండ్‌లో 21-11, 21-17తో మహ్మద్ రాజిఫ్ లతీఫ్-సనాతాసా సనిరూ (మలేసియా) జోడీపై గెలిచింది.

బుధవారం జరిగే పురుషుల సింగిల్స్ మెయిన్ ‘డ్రా’ తొలి రౌండ్‌లో తియెన్ మిన్ ఎన్గుయెన్ (వియత్నాం)తో కిడాంబి శ్రీకాంత్; లీ హున్ (కొరియా)తో పారుపల్లి కశ్యప్; వోంగ్ వింగ్ విన్సెంట్ (హాంకాంగ్)తో ప్రణయ్; సన్ వాన్ హో (కొరియా)తో గురుసాయిదత్; జాన్ జార్గెన్‌సన్ (డెన్మార్క్)తో సాయిప్రణీత్ తలపడతారు.

>
మరిన్ని వార్తలు